ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vishwa Vikhyatha NataSamrat Title Presentation to Kaikala

ఈ అవార్డు అందుకోవడం గర్వంగా వుంది: కైకాల

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణకు టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసామ్రాట్‌ బిరుదు ప్రదానం చేశారు. విశాఖలో జరిగిన మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం సాగింది. మంగళవారం రాత్రి ఆర్కేబీచ్‌ తీరంలో జరిగిన కార్యక్రమంలో టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ వ్యవస్థాపకుడు సుబ్బరామిరెడ్డి, మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్‌, సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుల చేతుల మీదుగా కైకాల సత్యనారాయణకు బిరుదుతో పాటు బంగారు కంకణాన్ని ప్రదానం చేశారు.

విశాఖ సాగరతీరంలో మహా కుంభాభిషేకం నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపీఠం ఆధ్వర్యంలో కోటి లింగాలతో శివలింగాకృతిని ఏర్పాటుచేసి, భక్తులతో అభిషేకాలు చేయించారు. ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించేందుకే సుబ్బిరామిరెడ్డి 30 ఏళ్లుగా మహాశివరాత్రి వేడుకలను సాగరతీరాన ఘనంగా నిర్వహిస్తున్నారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.    

సినీ రంగంలో కైకాల చేసిన కృషికి ఈ అవార్డును బహుకరిస్తున్నట్లు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. విశాఖ ప్రజలు బాగుండాలన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమాలను జీవితాంతం కొనసాగిస్తానన్నారు. 

ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రధాన ప్రసంగం చేశారు. శివ ధర్మాలను పాటిస్తే గొప్ప ఫలితాలు లభిస్తాయన్నారు. నాలుగు దశాబ్దాల సినీ పయనం.. 780 చిత్రాల్లో నటించిన అనుభవం.. ఇదీ కైకాల సత్యనారాయణ ఘనత. ఆయన్ను చూసి నేటి తరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సినీ రంగంలో వివిధ తరాలతో, అందరి నటులతో ఎన్నో పాత్రలు పోషించి... సంతృప్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. సుబ్బరామిరెడ్డి కళాకారులను ప్రోత్సహిస్తారని కొనియాడారు. తనకు 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు రామానుజ చరిత్ర సినిమా తీస్తానని గతంలోనే ప్రకటించానన్నారు. కైకాల సత్యనారాయణను చూసి నేటితరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు.   

మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కైకాల అన్నిరకాల పాత్రలు పోషించిన ఆల్‌రౌండర్‌ అని కొనియాడారు. ఎంపీ మురళీమోహన్‌, తెలంగాణ తెదేపా నేత పెద్దిరెడ్డి, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు కైకాల సినీ సేవలను ప్రస్తుతించారు. 

అవార్డు గ్రహీత కైకాల మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన అవార్డుల కంటే ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. సుబ్బరామిరెడ్డి గొప్ప మనసున్నవాడన్నారు. తన సంపాదనలో కొంత కళాకారులకు ప్రోత్సహించడానికి ఖర్చుచేస్తున్నాడని అన్నారు. 

ఈ సందర్భంగా సినీ, నాటక, కళా, విద్యా, సామాజిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అవార్డులను అందించారు. డాక్టర్‌ శోభానాయుడు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అలరించింది. గుమ్మడి గోపాలకృష్ణ, వంకాయల మారుతీ ప్రసాద్‌, శ్రీ రామాంజనేయ యుద్ధం నాటిక ఘట్టం ప్రదర్శించారు. సినీ, కళా, సామాజిక రంగాల్లో కృషిచేసిన పలువురికి టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో శివశక్తి అవార్డులను సైతం బాలకృష్ణ అందజేశారు. కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు.

Vishwa Vikhyatha NataSamrat to Kaikala Satyanarayana

Vishwa Vikhyatha NataSamrat Title Presentation to Kaikala
vishwa vikhyatha natasamrat
kaikala satyanarayana
balakrishna
tsr
murali mohan
vizag