సెహ్వాగ్ ఫిదా.. ఇక విరాట్-అనుష్క వంతు?
After Virender Sehwag's Praise, Hanuman Ansh Directorఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితాధారంగా తెరకెక్కిన `హనుమాన్ అంశ` చిత్రం బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని సాధించి ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం వీరేందర్ సెహ్వాగ్ పిల్లలతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సెహ్వాగ్ నుంచి వచ్చిన స్పందనపై దర్శకుడు డాక్టర్ విశాల్ చతుర్వేది భావోద్వేగానికి గురయ్యారు. తాను క్రికెట్కు అభిమానని, సెహ్వాగ్ రిటైర్ అయిన రోజే తాను క్రికెట్ చూడటం మానేశానని అలాంటిది ఆయన తమ సినిమాను స్వయంగా చూసి ప్రశంసించడం డ్రీమ్ కమ్ ట్రూ లాంటిదని హర్షం వ్యక్తం చేశారు.
సెహ్వాగ్ స్పందనతో రెట్టింపు ఉత్సాహంలో ఉన్న దర్శకుడు చతుర్వేది మరో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ .. ఆయన సతీమణి అనుష్క శర్మ కూడా ఈ చిత్రాన్ని చూడాలని తన ప్రత్యేక ఆకాంక్షను వెల్లడించారు. విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులకు ఉత్తరాఖండ్లోని నీమ్ కరోలీ బాబా కైంచీ ధామ్ ఆశ్రమంతో ఆధ్యాత్మిక అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. వారు క్రమం తప్పకుండా ఆశ్రమాన్ని సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో బాబాజీ జీవితం ఆధారంగా రూపొందిన హనుమాన్ అంశ చిత్రం వారికి ఖచ్చితంగా నచ్చుతుందని.. వారి కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
2 కోట్ల చిన్న బడ్జెట్తో నిర్మితమై ఎలాంటి ప్రమోషన్లు లేకుండా విడుదలైన భక్తిరస చిత్రం తొలి వారాల్లో మందగించినప్పటికీ మూడో వారం నుంచి బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న అనూహ్య ఆదరణ .. ప్రముఖుల మద్దతుతో మేకర్స్ ఇప్పటికే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా నిర్మించ బోతున్నట్లు ప్రకటించారు. సెలబ్రిటీలు , ఆధ్యాత్మిక వేత్తల ప్రశంసలతో `హనుమాన్ అంశ` ప్రయాణం రోజురోజుకూ మరింత ప్రత్యేకంగా మారుతోంది.







































