కపూర్ ఖాందాన్ వారసత్వం అరుదైన మైలురాయిని చేరుకుంది. సరిగ్గా 92 ఏళ్ల క్రితం 1934లో పృథ్వీరాజ్ కపూర్ `సీత` చిత్రంలో శ్రీరాముడి పాత్రలో నటించి మెప్పించగా ఇప్పుడు ఆయన మునిమనవడు రణబీర్ కపూర్ నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న `రామాయణం`లో అదే పవిత్రమైన పాత్రను పోషిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దిగ్గజ నటులు, రెండు వేర్వేరు శతాబ్దాలలో ఒకే పాత్రను వెండితెరపై ఆవిష్కరించడం సినీ చరిత్రలోనే అరుదైన రికార్డు.
నాడు దేబకీ బోస్ దర్శకత్వంలో వచ్చిన `సీత` చిత్రం వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిన తొలి భారతీయ శబ్ద చిత్రంగా అంతర్జాతీయ కీర్తిని సంపాదించింది. అప్పట్లో పృథ్వీరాజ్ కపూర్ తన నటనతో రాముడి పాత్రకు ఒక ప్రత్యేక హుందాతనాన్ని తీసుకొచ్చారు. నేడు రణబీర్ కపూర్ తన ఆహార్యం, మాటతీరులో ఆ ఉదాత్తతను ప్రతిబింబించేలా ప్రత్యేక శిక్షణ తీసుకుని మరీ రంగంలోకి దిగారు. ముత్తాత వేసిన బాటలో నడవడం కేవలం ఒక అవకాశంగా కాకుండా ఒక గొప్ప బాధ్యతగా భావిస్తూ రణబీర్ ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్ కోసం ఎంతో శ్రమిస్తున్నారు.
అప్పటి `సీత`లో దుర్గా ఖోటే సీతగా నటించి రికార్డు సృష్టించగా ఇప్పటి రామాయణంలో దక్షిణాది నటి సాయి పల్లవి సీతమ్మ పాత్ర పోషిస్తుంది. నాడు పృథ్వీరాజ్-దుర్గా ఖోటే సృష్టించిన మ్యాజిక్ను మళ్ళీ రణబీకపూర్- సాయి పల్లవి రిపీట్ చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ పౌరాణిక గాథలో మొదటి భాగాన్ని ఇదే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండవ భాగాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.





క్రేజీగా డెకాయిట్ థియేట్రికల్ బిజినెస్ 

Loading..