Advertisementt

40 వసంతాల సింహాస‌నం

Sat 21st Mar 2026 03:27 PM
krishna  40 వసంతాల సింహాస‌నం
40 Years of Simhasanam 40 వసంతాల సింహాస‌నం
Advertisement
Ads by CJ

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త ప్రయోగాలకు నాంది పలికిన సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్‌లో సింహాసనం ఒక అద్భుత దృశ్యకావ్యం. 1986 మార్చి 21న విడుదలైన ఈ చిత్రం నేటితో 40 వసంతాలను పూర్తి చేసుకుంది. అప్పట్లో వరుస పరాజయాలతో ఉన్న కృష్ణను ఈ సినిమా ఒక్కసారిగా బాక్సాఫీస్ విజేతగా నిలబెట్టి ఆయన ఇమేజ్‌ను శిఖరాగ్రానికి చేర్చింది. 

కేవలం 60 రోజుల్లోనే తెలుగు - హిందీ భాషల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్రీకరణ పూర్తి చేయడం అప్పట్లో ఒక సంచలనం. పద్మాలయా స్టూడియోస్‌లో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన భారీ సెట్లు పరిశ్రమ వర్గాలను సైతం విస్మయానికి గురిచేశాయి. టాలీవుడ్‌కు తొలిసారిగా 70ఎంఎం 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్‌ను పరిచయం చేసిన ఘనత కూడా ఈ చిత్రానిదే. దర్శకత్వ బాధ్యతలు స్వయంగా చేపట్టిన కృష్ణ విక్రమసింహ, ఆదిత్య వర్ధనుడు అనే రెండు పాత్రల్లో అద్భుత నటనను కనబరిచి ప్రేక్షకులను అల‌రించారు.

సింహాసనం సినిమా కేవలం సాంకేతిక విప్లవాన్నే కాకుండా వసూళ్ల పరంగానూ సరికొత్త చరిత్రను సృష్టించింది. విజయవాడ వంటి నగరాల్లో జనప్రవాహాన్ని అదుపు చేయలేక థియేటర్ల వద్ద చరిత్రలో తొలిసారిగా 144 సెక్షన్ విధించాల్సి వచ్చిందంటే ఈ చిత్రం రేపిన ప్రభంజనం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. జయప్రద, రాధలతో పాటు బాలీవుడ్ భామ మందాకిని అలాగే విలన్ అంజాద్ ఖాన్‌లను తెలుగు తెరకు పరిచయం చేస్తూ కృష్ణ చేసిన ఈ సాహసం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. 

బప్పీలహరి సంగీతం, వీరు దేవగణ్ నేతృత్వంలోని పోరాట ఘట్టాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కేవలం తెలుగులోనే 1.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించడమే కాకుండా మద్రాసులో జరిగిన శతదినోత్సవ వేడుకకు ఆంధ్రప్రదేశ్ నుండి 400 బస్సుల్లో అభిమానులు తరలిరావడం ఒక అరుదైన రికార్డుగా మిగిలిపోయింది. ఇలా ప్రతి అంశంలోనూ సాహసానికి చిరునామాగా నిలిచిన ఈ చిత్రం కృష్ణను ఒక పాన్ ఇండియా స్టార్‌గా తిరుగులేని శక్తిగా మార్చేసింది.

40 Years of Simhasanam:

Krishna Simhasanam 40 Years 

Tags:   KRISHNA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ