సోషల్ మీడియాలు, డిజిటల్ మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంతో సినిమాల్ని ఫ్లాప్ చేయడానికి, ఆ హీరో లేదా చిత్రబృందాన్ని బ్యాడ్ చేయడానికి పెయిడ్ మాఫియాలు పని చేస్తున్నాయని, కొందరు గ్రూపులుగా ఏర్పడి కుట్రలు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు కార్తీక్ సుబ్బరాజు. అతడు స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన `రెట్రో` ఇటీవల విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన `రెట్రో` మంచి ఓపెనింగులు సాధించినా కానీ, వేగంగా కలెక్షన్లు మందగించడం ఆశ్చర్యపరిచింది. కనీసమాత్రంగా 50 కోట్లు వసూలు చేయడానికి చాలా ఇబ్బంది పడింది.
తాజాగా గలాట్టాతో ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ -``రెట్రో సినిమాపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం సాగించారని, డబ్బు తీసుకుని నెగెటివ్ గా ప్రచారం చేసేందుకు కొన్ని గ్రూపులు పని చేస్తున్నాయ`ని ఆరోపించారు. రెట్రో సినిమా బావున్నా సమీక్షలు ఎందుకు నెగెటివ్ గా వచ్చాయో తమకు అర్థం కాలేదని కూడా కార్తీక్ సుబ్బరాజు వాపోయారు. రెట్రో చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వేదికపై చక్కని ఆదరణ దక్కించుకుంటోంది. ఈ సినిమాలో ప్రథమార్థం బావుందని, కొన్ని యాక్షన్ సీన్స్ అద్భుతంగా తెరకెక్కించారని ప్రజల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.