ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం గా తనదైన ముద్ర వేస్తున్న పవన్ కళ్యాణ్ ఇటు ప్రొఫెషనల్ గా తను పూర్తి చెయ్యాల్సిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే వీరమల్లు, OG చిత్ర షూటింగ్స్ ని కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో హైదరాబాద్ లో బిజీగా ఉన్నారు.
క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ తాజాగా సంగారెడ్డిలో ఇక్రిశాట్ లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ కి వచ్చారు. తన చిన్న కొడుకు మార్క్ శంకర్ అడ్మిషన్ కోసం పవన్ సంగారెడ్డిలోని ఇక్రిశాట్ ఇంటర్నేషనల్ స్కూల్ కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్రిశాట్ ఆవరణలో ఉన్న ఇంటర్నేషనల్ హైదరాబాద్ స్కూల్లో చాలామంది సినీ ప్రముఖుల పిల్లలు చదువుతుండగా ఇప్పుడు పవన్ చిన్న కొడుకుని అక్కడే జాయిన్ చెయ్యాలనే నిర్ణయానికి పవన్ వచ్చారట.
అందుకే ఆయన ఆ స్కూల్ కి వెళ్లి మార్క్ శంకర్ అడ్మిషన్ కోసం మాట్లాడారని అంటున్నారు. కొద్దిరోజుల ముందు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్ అగ్నిప్రమాదంలో గాయపడి కోలుకున్నాడు. అప్పటినుండి హైదరాబాదులోనే ఉంటుండగా తిరిగి స్కూల్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మార్క్ శంకరును ఇక్కడే చదివించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.