ప్రముఖ బాలీవుడ్ నటుడు డినో మోరియో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. అతడు అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్లో విలన్ పాత్రను పోషించాడు. డినో ఒడ్డు పొడుగు, స్ఫురద్రూపం విలనీకి బాగా సూటైంది. కానీ ఈ సినిమా విజయం సాధించకపోవడంతో అది అతడి కెరీర్ కి మైనస్ గా మారింది.
ఇదిలా ఉంటే డినో మోరియో అతడి సోదరుడిపై నది పూడిక తీత కుంభకోణం కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ నిమిత్తం ముంబై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు స్టేషన్ కు పిలిచారు. ఈ రోజు దాదాపు ఎనిమిది గంటల పాటు డినో అతడి సోదరుడిని పోలీసులు విచారించారని సమాచారం. ఉదయం 11 గంటల నుంచి వీరు సాయంత్రం 7 గంటల వరకూ ఈవోడబ్ల్యూ విభాగంలో కనిపించినట్టు తెలుస్తోంది. ముంబై మిథి నది పూడిక తీత కుంభకోణం విలువ సుమారు 65 కోట్లుగా ఉందని తెలుస్తోంది. దీని చుట్టూనే పోలీసులు మోరియో బ్రదర్స్ ని విచారించారు.
ఈ కేసులో 13మంది నిందితులు ఉండగా, ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసారు. డినోని ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు కేతన్ కదమ్ (50), జే జోషి (49) ఇప్పటికే అరెస్టయి అర్థర్ రోడ్ జైలులో ఉన్నారు. పూడిక తీత పేరుతో బిల్లులు సమర్పించి డబ్బు దోచుకున్నారనేది వీరిపై ఆరోపణ. డినో మున్సిపల్ అధికారులతో కుమ్మక్కయి, ప్రభావితం చేయడం ద్వారా ఈ కుంభకోణానికి పాల్పడినట్టు అధికారులు చెబుతున్నారు.