సౌదీ అరేబియాలో 40 ఏళ్లు గొడ్డు చాకిరీ చేసిన కేరళకు చెందిన ఓ కూలీ జాక్ పాట్ కొట్టాడు. ఇక లాభం లేదనుకుని తన స్వస్థలానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్న సమయంలో అతడి దశ తిరిగిపోయింది. అతడు అబుదాబిలో జరిగిన బిగ్ టికెట్ డ్రాలో రూ. 57 కోట్లు గెలుచుకోవడం ఊహించని మలుపు. కేరళలోని తిరువనంతపురం జిల్లాకు చెందిన తాజుదీన్ అలియాస్ కుంజు సౌదీ అరేబియాలో ఉన్న సమయంలో తిండికి లేక ఆకలి మంటల్ని ఎదుర్కొన్నాడు. దేశం కాని దేశంలో ఎన్నో సవాళ్లు భయపెట్టాయి. అయితే అతడిని లాటరీ టికెట్లు కొనే అలవాటు ఇప్పుడు సేవ్ చేసింది. ఊహించని విధంగా తన ఐదవ ప్రయత్నంలోనే బిగ్ టికెట్ గెలుచుకున్నాడు.
జీవనోపాధి కోసం కడుపు మంటతో 1985లో సౌదీ అరేబియాలో అడుగుపెట్టిన అతడు అందరిలాగే పెద్ద కలలతో గల్ఫ్కు వెళ్లానని తెలిపాడు. తనకు ఉపాధి విషయంలో మార్గదర్శనం లేదు.. కాలే కడుపు ఆకలి తీర్చుకునేందుకు కూడా కష్ట కాలం దాపురించడంతో తిరుగు ప్రయాణం అయ్యాను.. ఇంతలోనే ఈ అదృష్టం వరించింది! అని గల్ఫ్ న్యూస్ ఇంటర్వ్యూలో అతడు చెప్పాడు.
బిగ్ టికెట్ డ్రా గురించి తెలుసుకున్న తర్వాత, డబ్బును ఎలా ఖర్చు చేయాలనుకుంటున్నాడో కూడా అతడు చెప్పాడు. కుంజ్ మరో 16 మందితో కలిసి ఈ లాటరీ టికెట్లపై పెట్టుబడి పెట్టాడు. ప్రతి వ్యక్తి 100 సౌదీ రియాల్ కంటే తక్కువ మొత్తాన్ని లాటరీ కోసం కేటాయించారు. కానీ లక్కీగా రూ. 57 కోట్ల జాక్ పాట్ తగిలింది. ఇప్పుడు బహుమతి డబ్బును భాగస్వాములందరికీ పంపిణీ చేయాల్సి ఉంటుంది. వీరిలో 15 మంది కేరళకు చెందినవారు కాగా, ఒకరు తమిళనాడుకు చెందిన వ్యక్తి. గ్రూప్ లో అన్నీ కాలే కడుపులే. అందుకే డబ్బు పంపిణీ చాలా అవసరం అని తెలిపాడు.