CWC 2023: ఫైనల్‌కి ఇండియా.. గెలిచారు

CWC 2023: India into the Final

క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా ముంబై వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ 1లో కివీస్‌ను ఓడించి భారత్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. కివీస్‌పై ఉన్న చెత్త రికార్డ్‌కు బ్రేక్ ఇచ్చి 70 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 327 పరుగులు చేసి ఆలౌటైంది. మహహ్మద్ షమీ అసాదారణమైన బౌలింగ్‌తో 7 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కివీస్ బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఓపెనర్లు తక్కువ స్కోర్‌కే అవుటైన.. కెప్టెన్ విలియమ్సన్, మిచెల్ భారీ షాట్లతో భారత్ బౌలింగ్‌కు పరీక్ష పెట్టారు. ఒకానొక దశలో వీరిరువురి బ్యాటింగ్‌ చూసిన ప్రేక్షకులకి.. భయం కూడా వేసిందంటే అతిశయోక్తి కానే కాదు. 39 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన కివీస్‌.. 220 పరుగుల వద్ద మూడో వికెట్‌ని కోల్పోయిందంటే కెన్, మిచెల్ ఏ రకంగా విధ్వంసం చేశారో ఊహించుకోవచ్చు.

వీరిద్దరూ మరీ భయంకరంగా మారుతున్న దశలో మళ్లీ షమీనే విలియమ్సన్‌ను అవుట్ చేసి భారత్ ఊపిరి పీల్చుకునేలా చేశాడు. అయినా కూడా మిచెల్ తన జోరుని కొనసాగిస్తూనే భారత్‌ని భయపెట్టాడు. కెన్ అవుట్‌తో వచ్చిన టామ్ లాథమ్‌ని షమీ డకౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత వచ్చిన ఫిలిఫ్స్‌ కాసేపు మెరుపులు మెరిపించాడు. మిచెల్, ఫిలిఫ్స్ భారీగా ఆడుతూ స్కోర్ బోర్డును లక్ష్యం వైపుగా తీసుకెళుతున్న సమయంలో ఫిలిఫ్స్‌ (41)ని అవుట్ చేసి బుమ్రా భారత్‌కు బ్రేకిచ్చాడు. ఇక ఆ తర్వాత కివీస్‌కు భారత్ ఛాన్స్ ఇవ్వలేదు. వరస వికెట్లతో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. చాప్‌మెన్ (2)ని కుల్‌దీప్, శాంట్నర్‌(9)ని సిరాజ్ అవుట్ చేయగా.. మిగిలిన రెండు వికెట్లను షమీ తన లాస్ట్ ఓవర్‌లో తీసి భారత్‌కు విజయాన్ని అందించాడు. 

మొత్తంగా షమీ 7 వికెట్లతో కివీస్‌ పతనానికి కారణమయ్యాడు. బుమ్రా, కుల్‌దీప్, సిరాజ్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో నాకౌట్‌లో కివీస్‌పై ఉన్న చెత్త రికార్డ్‌‌ను భారత్ బ్రేక్ చేసింది. 50 సెంచరీలు చేసి కోహ్లీ, 50 సిక్సర్లు కొట్టి రోహిత్ రికార్డులు క్రియేట్ చేయగా.. తక్కువ మ్యాచ్‌లలో ఎక్కువ వికెట్లు, వరల్డ్ కప్‌లో 4 సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ రికార్డ్‌ని క్రియేట్ చేశాడు. భారత్‌కు కాసేపు టఫ్‌గా అనిపించినా.. చివరికి విజయం మాత్రం భారత్‌నే వరించింది. ఈ విజయంతో అజేయంగా భారత్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. అంతేకాదు, ఈ విజయంతో వరుసగా అన్ని మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక చరిత్ర సృష్టించడానికి కేవలం అడుగు దూరం.. ఒకే ఒక్క మ్యాచ్ భారత్‌కు ఉంది. రెండో సెమీ ఫైనల్ గురువారం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించిన మహమ్మద్ షమీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

India won by 70 runs in CWC 2023 Semi Final

india final