రాజేష్ టచ్రివర్ దర్శకత్వంలో ‘సైనైడ్’

జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్ టచ్రివర్ ప్రకటించిన కొత్త సినిమా ‘సైనైడ్’. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు మోసిన నేరస్థుడు, 20మంది యువతుల మరణానికి కారణమైన మానవ మృగం ‘సైనైడ్’ మోహన్ కథతో ఈ సినిమా రూపొందుతోంది. మిడిల్ ఈస్ట్ ప్రై.లి. పతాకంపై ప్రవాసీ పారిశ్రామికవేత్త ప్రదీప్ నారాయణన్ నిర్మించనున్నారు. ‘అత్యంత అరుదైన కేసులలో అరుదైన కేసు’గా కోర్టు పరిగణించిన అతడి కథను తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించనున్నారు. గురువారం ‘సైనైడ్’ మోహన్ కేసులో తుది తీర్పు వచ్చిన సందర్భంగా సినిమా ప్రకటించారు.
దర్శకుడు రాజేష్ టచ్రివర్ మాట్లాడుతూ.. ‘‘ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల వేసి, కర్ణాటకలోని వివిధ హోటల్ రూమ్స్కి పిలిచి... ఆ తర్వాత శారీరక సంబంధం ఏర్పరచుకుని వంచించిన నరరూప రాక్షసుడు ‘సైనైడ్’ మోహన్. లైంగింక వాంఛలు తీరిన తర్వాత యువతులకు గర్భనిరోధక మాత్రలు అని చెప్పి సైనైడ్ పిల్స్ ఇచ్చి చంపేవాడు. తర్వాత అమ్మాయుల బంగారు ఆభరణాలతో ఉడాయించేవాడు. ఏమాత్రం కనికరం లేకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతుల మరణానికి కారణమాయ్యాడు. ఈ కేసులో మోహన్కి 6 మరణశిక్షలు, 14 జీవితఖైదులు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇందులో తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తారు’’ అని అన్నారు.
నిర్మాత ప్రదీప్ నారాయణన్ మాట్లాడుతూ.. ‘‘కరోనా భయాలు పోయిన తర్వాత, ప్రభుత్వ అనుమతులు తీసుకొని చిత్రీకరణ ప్రారంభిస్తాం. గోవా, బెంగళూరు, మంగుళూరు, కూర్గ్, మడక్కరి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. రాజేష్ టచ్రివర్ కథ, స్ర్కీన్ప్లే అందిస్తున్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీతా కృష్ణన్ మా కంటెంట్ అడ్వైజర్. కమల్ హాసన్ ‘విశ్వరూపం’, ‘ఉత్తమ విలన్’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పని చేసిన సదత్ సైనుద్దీన్ మా చిత్రానికి పని చేస్తున్నారు’’ అని అన్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, ఎడిటింగ్: శశికుమార్, ఆర్ట్: గోకుల్ దాస్, మ్యూజిక్: జార్జ్ జోసెఫ్.
Rajesh Touchriver next Film Announced
Cyanide Mohan's case to hit screens as a Crime Thriller







































