మణిరత్నం మూవీలో ఐశ్వర్యరాయ్ డబుల్ రోల్!

మణిరత్నం అంటే నిజంగా డైరక్టర్లలో ‘మణి’..‘రత్నమే’. ఇది ఒకప్పటి మాట.. కానీ రోజులు మారే కొద్ది ఈయన్ను పట్టించుకునే.. తెరకెక్కించిన సినిమాలు చూసే నాథుడే లేకుండా పోయారు. ఒకప్పుడు ఈయన సినిమా తీశాడంటే క్రేజ్ మామూలుగా ఉండేది కాదు.. మణి సినిమాకు పోటీగా రిలీజ్ చేయాలన్నా దర్శకనిర్మాతలు జంకేవారు. అలాంటిది ఇప్పుడు మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. దేశం గర్వించదగిన దర్శకుల జాబితాలో మణిరత్నం పేరు కనిపిస్తుందన్నది మాత్రం జగమెరిగిన సత్యమే. ఎందుకంటే వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని, సామాజిక సందేశాలను అందించే కథలనే మణిరత్నం తెరకెక్కిస్తుంటారు. అందుకే ఈయనకు ఎన్ని పేర్లు పెట్టినా.. ఎన్ని బిరుదులిచ్చినా తక్కువే మరి.
ఇప్పటికే చేయాల్సిన ప్రయోగాలు చేసేసిన మణిరత్నం.. ఇప్పుడు చారిత్రక నేపథ్యమున్న కథను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కథకు ‘పొన్నియన్ సెల్వన్’ అనే పేరును ఖరారు చేసేశారు కూడా. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్తో కలిసి మణిరత్నం నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే.. విక్రమ్, కార్తీ, పార్తీబన్, మోహన్ బాబు, విజయ్ సేతుపతి, జయం రవి, కీర్తి సురేశ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నట్లు పక్కా సమాచారం ఉంది.
అయితే తాజాగా.. అందానికి మారుపేరు.. ప్రపంచం మెచ్చిన అందాల సుందరి ఐశ్వర్యరాయ్ .. ఈ సినిమాలో నటిస్తోందని విశ్వసనీయవర్గాల సమాచారం. చారిత్రక నేపథ్యమున్న సినిమా గనుక మంచి పాత్ర ఉందని చెప్పడంతో ఐశ్వర్య మారుమాట చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ సినిమాలో ఈ అందాల తార డబుల్ రోల్ చేస్తోందని తెలుస్తోంది. ఒకటి మందాకినీ దేవిగా.. రెండోది ఆమె కూతురు నందినిగా కనిపించి మెప్పిస్తుందని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు అటు బీ టౌన్.. ఇటు కోలీవుడ్.. టాలీవుడ్లో పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ఇంతవరకూ దర్శకనిర్మాతల నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
Aishwarya Rai Bachchan To Play Double Role In Mani Ratnam’s Film
Aishwarya Rai Bachchan To Play Double Role In Mani Ratnam's Film








































