దాదాపు 10,000 కోట్ల నికర ఆస్తులు కలిగిన సంస్థలను నడిపిస్తున్నాడు ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీనటుడు నిర్మాత సంజయ్ కపూర్. అతడి ఆకస్మిక మరణం తర్వాత ఆస్తులు అంతస్తులు వారసత్వం గురించి విస్త్రతంగా చర్చ సాగుతోంది. సంజయ్ కపూర్ ప్రముఖ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త. అతడికి మూడు పెళ్లిళ్లు. ప్రస్తుతం మూడో భార్య ప్రియా సచ్ దేవ్ తో భాగస్వామి. కరిష్మాతో ఇద్దరు పిల్లలు.. మూడో భార్య ప్రియాతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అతడి వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు నడిపించేంత వయసు లేకపోవడంతో పిల్లల్లో ఎవరికీ `సోనాకామ్` సంస్థ గుత్తాధిపత్యం దక్కదు. అయితే అతడి కంపెనీలను నడిపే బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్నదే ఇటీవల చర్చగా మారింది.
సంజయ్ కి చెందిన సోనాకామ్ కంపెనీ ఆటో విడిభాగాలను ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీ. భారతదేశం సహా ప్రపంచ దేశాల్లో విస్తరించి ఉంది. ఇక సంజయ్ కపూర్ వ్యాపార సామ్రాజ్యంలో రాజుగా కొనసాగడమే కాదు.. అతడు మంచి పోలో ఆటగాడు. లండన్ లో నిరంతరం అతడు పోలో గ్రౌండ్స్ కి వెళుతుంటాడు. అకస్మాత్తుగా ఒకరోజు అతడు పోలో ఆడుతుండగా, ఒక తేనెటీగ అతడి గొంతులోకి దూరి కరిచింది. దాంతో తీవ్రమైన అలెర్జీకి గురైన అతడి గొంతు నాళం మూసుకపోవడంతో ఊపిరి ఆడక గుండెనొప్పితో మరణించాడని కథనాలొచ్చాయి. అయితే దీనికి ఇంతవరకూ అధికారిక ధృవీకరణ లేదు.
ఈరోజు (20 జూన్) దిల్లీలో జరిగిన అంత్య క్రియల్లో అతడి భార్య ప్రియా సచ్ దేవ్, పిల్లలు, అలాగే మాజీ భార్య కరిష్మా కపూర్ , ఆమె పిల్లలు పాల్గొన్నారు. అంత్యక్రియల్లో కరిష్మా భావోద్వేగానికి గురి కాగా, పిల్లలు కంట తడి పెట్టిన దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఈ అంత్యక్రియల్లో కరిష్మా సోదరి కరీనా కపూర్, ఆమె భర్త సైఫ్ ఖాన్ కూడా పాల్గొన్నారు. ఒక పెద్ద సంస్థ అధినేత అంతిమ యాత్ర దృశ్యాలతో ఇంటర్నెట్ గంభీరంగా మారింది. లండన్ లో చట్టపరమైన సమస్యలు తలెత్తడంతో సంజయ్ కపూర్ పార్థీవ దేహాన్ని భారతదేశానికి తీసుకుని రావడానికి ఆలస్యమైందని జాతీయ మీడియా తన కథనాల్లో పేర్కొంది.