డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు..! డబ్బు డబ్బును పెంచుతుంది!! అగ్ర కథానాయికగా సుదీర్ఘ కాలం సినీపరిశ్రమలో ఆర్జించిన సంపాదనను శిల్పాశెట్టి రకరకాల వ్యాపార మార్గాల్లో పెట్టుబడులుగా పెట్టి సంపాదిస్తున్న వైనం తాజాగా చర్చకు వచ్చింది. శిల్పాశెట్టి ప్రస్తుతం సినిమాలు, బుల్లితెర రియాలిటీ షోలతో బిజీ బిజీగా ఉంది. ఈ రెండు రంగాల్లో కోట్లు ఆర్జిస్తున్న శిల్పా, తన భర్తతో కలిసి బాస్టియన్ అనే రెస్టారెంట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టింది. బాస్టియన్ వ్యవస్థాపకుడు రంజిత్ తో కలిసి హోటల్ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తోంది. బాంద్రా బాస్టియన్ లో తినడానికి వెళ్లి ఏకంగా ఆ బ్రాండ్ ని విస్తరించేందుకు వాటా దారులుగా చేరారు శిల్పా-కుంద్రా.
ఇప్పటికే ముంబైలో మూడు చోట్ల బాస్టియన్ హోటల్స్ విజయవంతంగా రన్ అవుతున్నాయి. ముంబై బాంద్రా, వర్లి, దాదార్ లో వ్యాపారం ఫుల్ స్వింగ్ లో ఉంది. బెంగళూరు, పూణే లాంటి చోట్లా బాస్టియన్ రెస్టారెంట్లను విస్తరించారు. ప్రస్తుతం గోవాలో మరో రెండు బాస్టియన్ రెస్టారెంట్లు ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు శిల్పా శెట్టి చెబుతోంది. మొత్తం ఆరు బాస్టియన్ రెస్టారెంట్లు ఉన్నాయని శిల్పా చెబుతోంది. ఈ రెస్టారెంట్లకు సెలబ్రిటీల ఆదరణ బావుంది. ఇందులో ఫుడ్, యాంబియెన్స్ ప్రతిదీ అగ్రశ్రేణి తారల్ని, సెలబ్రిటీల్ని ఆకర్షిస్తున్నాయి. దీంతో నెలకు హోటల్ రంగం నుంచి సుమారు 6 కోట్ల ఆదాయం శిల్పాశెట్టి - కుంద్రా జంట ఆర్జిస్తున్నారని సమాచారం. బాస్టియన్ .. అత్యధిక జీఎస్టీ పే చేసిన హోటళ్ల జాబితాలోను ఉందని శిల్పాశెట్టి తెలిపింది. 6 కోట్లు కాదు అంతకుమించి ఆర్జిస్తున్నామని కూడా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. బాస్టియన్ తో పాటు ఇతర పేర్లతోను రెస్టారెంట్లను శిల్పాశెట్టి రన్ చేస్తోంది. మునుముందు హైదరాబాద్, కలకత్తా సహా ఇతర మెట్రోలకు బాస్టియన్ ని విస్తరించే ఆలోచనతో శిల్పా శెట్టి అడుగులు వేస్తోందని సమాచారం.