తెలుగు చిత్రసీమలో కనీవినీ ఎరుగని రీతిలో ఒక భారీ సెట్ నిర్మాణం జరుగుతోందని సమాచారం. ఇది మహేష్ నటిస్తున్న ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా కోసం. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దీనిని ప్లాన్ చేసారు. ఈ ఒక్క సెట్ నిర్మాణం కోసం ఏకంగా 50 కోట్లు ఖర్చు చేస్తున్నారనేది ఒక సెన్సేషన్.
ఇంత పెద్ద బడ్జెట్ తో గతంలో సంజయ్ లీలా భన్సాలీ తన సినిమా `దేవదాస్` కోసం సెట్ ని నిర్మించారు. అడుగడుగునా కళాత్మకత ఉట్టిపడేలా సెట్లు డిజైన్ చేయించడంలో భన్సాలీ తర్వాతే. అతడు రూపొందించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో, భాజీరావ్ మస్తానీ, రామ్ లీలా, హీరామండి వంటి చిత్రాలకు భారీతనం నిండిన సెట్స్ ని నిర్మించారు. వీటి కోసం 15 కోట్ల వరకూ ఖర్చు చేసారని కథనాలొచ్చాయి. అయితే ఇప్పటివరకూ అత్యంత ఖరీదైన సెట్ నిర్మాణం దేవదాస్ కోసమే చేసారు. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి తన సినిమా కోసం ఇంత భారీ బడ్జెట్ ని కేటాయించి వారణాసి నగరాన్ని సెట్ రూపంలో డిజైన్ చేస్తున్నారని తెలిసింది.
పవిత్ర గంగా నది ఒడ్డున జనాల్ని మేనేజ్ చేస్తూ వారణాసిలో షూటింగ్ చేయడం అంటే ఆషామాషీ కాదు. ప్రజల్ని అదుపు చేయడం చాలా కష్టం. పైగా పోలీసుల నుంచి ఆధ్యాత్మిక నగరంలో భారీ సినిమాల నిర్మాణానికి అనుమతులు లభించడం కూడా కష్టం. అందుకే ఇప్పుడు వారణాసి నగరాన్ని సెట్ రూపంలో నిర్మిస్తున్నారని సమాచారం. అడవి నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.