*కన్నప్ప అద్భుతంగా ఉందని సూపర్ స్టార్ రజినీకాంత్ గారు మెచ్చుకున్నారు : విష్ణు మంచు*
దిగ్గజ నటులు రజనీకాంత్, డాక్టర్ ఎం. మోహన్ బాబు కలిసి నటించిన పెద రాయుడు చిత్రానికి ముప్పై ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చెన్నైలో వీరిద్దరూ కలుసుకుని నాటి జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నారు. జూన్ 15, 1995న విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. సినిమా విడుదలై ముప్పై ఏళ్లు అవుతున్న సందర్భంగా ఇలా చెన్నైలో రజినీకాంత్, మోహన్ బాబు సందడి చేశారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కన్నప్ప సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు.
కన్నప్ప చిత్రాన్ని వీక్షించిన రజినీకాంత్ తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. సినిమా అద్భుతంగా ఉందని విష్ణుని కొనియాడారు. ఈ మేరకు విష్ణు మంచు సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. కన్నప్ప చిత్రాన్ని రజినీకాంత్ గారు ప్రత్యేకంగా వీక్షించారు. సినిమాను చూసిన తరువాత నన్ను గట్టిగా హత్తుకున్నారు. కన్నప్ప ఎంతో నచ్చిందని ఆయన అన్నారు. ఈ క్షణం కోసం నేను గత 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. నా నటనను ఆయన ఎప్పుడు మెచ్చుకుంటారు.. ఇలా ఎప్పుడు హత్తుకుంటారు అని అనుకుంటూ ఉన్నాను.. ఆ కల ఇప్పుడు నెరవేరింది. నాకు ఈ రోజు ఎంతో ఆనందంగా, సంతోషంగా, గర్వంగా ఉంది అని అన్నారు.
డా. ఎం. మోహన్ బాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. జూన్ 15కి పెద రాయుడు రిలీజ్ అయి 30 ఏళ్లు పూర్తయ్యాయి. అదే రోజు నా ప్రియ మిత్రుడు రజినీకాంత్ కన్నప్ప చిత్రాన్ని వీక్షించారు. ఆయన తన ఫ్యామిలీతో సహా మూవీని వీక్షించారు. సినిమా చూసిన తరువాత ఆయన కురిపించిన ప్రేమ, ప్రశంసలు, ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను. థాంక్యూ మిత్రమా అని అన్నారు.