ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ఇటీవల లండన్ లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అతడు సోనా కామ్ స్టార్ కంపెనీ యజమాని. ప్రముఖ బాలీవుడ్ కథానాయిక కరిష్మాకపూర్ మాజీ భర్తగా అతడు సుపరిచితుడు. అతడికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ప్రస్తుతం మోడల్ కం నటి ప్రియా సచ్ దేవ్ తో ఒక బిడ్డ అజారియాస్ (6)కు తండ్రి కాగా, కరిష్మాతో 20 వయసు కుమార్తె సమైరా, 16 వయసు కొడుకు కియాన్ ఉన్నారు.
ప్రఖ్యాత ఫోర్బ్స్ కథనం ప్రకారం.. సంజయ్ కపూర్ నికర ఆస్తి విలువ సుమారు 13,000 కోట్లు. అతడు కరిష్మా కపూర్ తో తన బిడ్డలకు 14 కోట్ల విలువ చేసే బాండ్లు రాసిచ్చాడు. వాటి ద్వారా వారికి నెలవారీగా 10లక్షల ఆదాయం వస్తోంది. అలాగే వారసత్వ సంపదగా వచ్చిన ఇల్లును కూడా కరిష్మాకు సంజయ్ కుటుంబీకులు ఇచ్చారు. విడాకుల తర్వాత కూడా ఈ జంట స్నేహంగా ఉన్నారు. అందువల్ల సంజయ్ కపూర్ మరణ సమయంలో కపూర్ కుటుంబం ఎంతో విచారంగా కనిపించింది. 13000 కోట్ల నికర ఆస్తులు ఉన్న సంజయ్ కపూర్ సోనా కామ్ స్టార్ అనే కంపెనీని నిర్వహిస్తున్నారు. అతడి మరణానంతరం ఇప్పుడు ఆ కంపెనీని ఎవరు నడిపిస్తారు? అన్నది ప్రశ్నగా మారింది. ప్రస్తుతానికి బోర్డ్ నిర్వహిస్తోంది. త్వరలోనే సంజయ్ కపూర్ సోదరీమణులు దీని బాధ్యతలు చేపడతారని కంపెనీ ప్రకటించినట్టు తెలిసింది.