బొడ్డు రాజబాబు రంగస్థలం, టీవీ, సినిమా రంగంలో సుప్రసిద్ధ కళాకారుడు. ఆయన తో ఒకసారి పరిచయం ఏర్పడితే అది జీవితాంతం మర్చిపోలేం, ఆయన స్మృతికి నివాళిగా మిత్ర బృందం పురస్కారాల కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ చెప్పారు.
బొడ్డు రాజబాబు 68వ జయంతి, స్మారక పురస్కారాల కార్యక్రమం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో శుక్రవారం జరిగింది. ముఖ్య అతిధిగా వచ్చిన గోపాల కృష్ణ మాట్లాడుతూ... రాజబాబు పేరుతో వివిధ రంగాల్లో నిష్టాతులైన వారిని సత్కరించి పురస్కారాలు అందజేయడం ఎంతో సముచితంగా ఉందని, రాజబాబు మా అందరికీ ఎంతో స్నేహపాత్రుడని అన్నారు.
ఈ కార్యక్రంలో పురస్కారాలు అందుకున్న డి. ఎస్. ఎన్. మూర్తి గారు మా గురువుగారు, భగీరథ గారు ఆత్మీయ మిత్రుడు. ఉగాది రోజు ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారు భగీరథ గారికి కళారత్న అవార్డు బహుకరించారు. మేమిద్దరం ఎన్. టి. ఆర్ సెంటినరీ కమిటీలో సభ్యులం అని చెప్పారు.
భగీరథ గారు శ్రీకృష్ణదేవరాయల ప్రేమ కథను నాగలాదేవి పేరుతో ఒక అద్భుతమైన పుస్తకం వ్రాశారు. ఆ పుస్తకాన్ని ఆందరూ చదివితీరాలి అని గోపాలకృష్ణ చెప్పారు.
సీనియర్ నిర్మాత కె. ఎస్. రామారావు మాట్లాడుతూ.. ప్రభుత్వాలే ప్రతి సంవత్సరం అవార్డులను ప్రదానం చేయలేకపోతున్నాయి. అలాంటిది రాజబాబు పేరుతో ప్రతి సంవత్సరం అవార్డులను అందిస్తున్నందుకు మిత్ర బృందాన్ని అభినందిస్తున్నా. వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమంలో మరింత మంది సినిమావారు పాల్గొనేలా చూడాలని కోరారు.
దర్శకుడు వీర శంకర్ మాట్లాడుతూ.. రాజబాబు చనిపోయినా ఇంకా ఆయన మిత్ర బృందం మనస్సులో పదిలంగా వున్నదని, రాజబాబు జన్మదినం అయినా జూన్ 13న పురస్కారాలు ప్రదానం చేసి ఒక వేడుకలా జరపడం, అదులో నన్ను భాగస్వామిని చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
సీనియర్ జర్నలిస్ట్ భగీరథ మాట్లాడుతూ.. రాజబాబు మా అందరికీ అంత్యంత ఆప్త మిత్రుడు, నాకు కళారత్న అవార్డు వచ్చిన సందర్భగా సత్కరిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. నాకోసం గుమ్మడి గోపాలకృష్ణ గారు విజయవాడ నుంచి రావడం నాకెంతో ఆనదాన్నిచ్చిందని, సభలో పాల్గొన్న అతిధులందరికీ భగీరథ ధన్యవాదాలు తెలిపారు.
నిర్వాహకులలో ఒకరైన కాకాని బ్రహ్మం మాట్లాడుతూ.. రాజబాబుకు మిత్రులంటే ప్రాణం, షూటింగ్ లేకపోతే ఆయన మిత్రులతోనే ఎక్కువ గడిపేవాడు. ఆయన పేరుతో ఇచ్చే ఈ పురస్కారాలకు ఆయన కుమారులు రమేష్, వీరన్న చౌదరిల తోడ్పాటు వుంది. ఈ సంవత్సరం తొమ్మిది మంది ప్రతిభావంతులకు పురస్కారాలను అందిస్తున్నామని చెప్పారు.
జ్యోతి పూర్ణిమ మాట్లాడుతూ.. రాజబాబు గారితో అభిషేకం, రాధా -మధు, మనసు -మమత సీరియల్స్ లో నటించాను. అందరినీ అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు, ఆయన స్మృతులు ఎప్పుడూ మనతోనే ఉంటాయని చెప్పారు.
ఈ కార్యక్రంలో దర్శకుడు బి.గోపాల్, తుమ్మల రంగారావు, నిర్మాత డీవీకే రాజు, దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు, ఆర్. నాగేశ్వరరావు, నర్రా వెంకట్ రావు, వి. కుమార్, వై. బాలాజీ, సూర్యతేజ, శైలజ, గోరంట్ల సురేష్, అట్లూరి నాగేశ్వర రావు, క్రొత్తపల్లి శ్రీధర్ ప్రసాద్, కొండపనేని ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
పురస్కారాలను దర్శకుడు వీర శంకర్, ఆచార్య డి .ఎస్. .ఎన్ .మూర్తి, కళారత్న భగీరథ, నటుడు జి. ఎస్, హరి, పరిశోధకుడు జి జి. బసవ శంకర్ రావు, పాటల రచయిత వెనిగెళ్ల రాంబాబు, విద్యావేత్త పూర్ణచంద్ర రావు, నటి జ్యోతి పూర్ణిమ స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో సినీజోష్ పర్వతనేని రాంబాబు జన్మదినోత్సవాన్ని ఘనంగా జరిపారు.