Advertisement

రావుగోపాలరావు వర్ధంతి నివాళులు

Sat 14th Aug 2021 01:44 PM
rao gopala rao,rao gopala rao vardhanthi,rao gopala rao movies,gopala rao news,rao gopala rao dialogues,rao ramesh,raogopalarao,gopala rao  రావుగోపాలరావు వర్ధంతి నివాళులు
Tributes to Rao Gopala Rao Vardhanthi రావుగోపాలరావు వర్ధంతి నివాళులు
Advertisement

ప్రముఖ సినీ & రంగస్థల నటుడు, నిర్మాత కళాప్రపూర్ణ డాక్టర్ రావుగోపాలరావు గారికి వర్ధంతి నివాళులు 

రావు గోపాలరావు తెలుగు సినిమా నటుడు, రాజ్యసభ సభ్యుడు (1986-1992).ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది. వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావుగోపాలరావు జనం హృదయాలల్ను మరోసారి కొల్లగొట్టుకున్నారు. గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళినా వయసులో వున్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మనవూరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. రంగస్థల నటుడుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన కీర్తిశేషులు నాటకంలోని పాత్రతో ప్రాముఖ్యత సంతరించుకున్న రావు గోపాలరావు కాకినాడలో కొంతకాలం అసోసియేటెడ్‌ అమెచ్యూర్‌ డ్రామా కంపెనీ నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించారు.

జననం - వివాహం: కాకినాడ సమీపంలోని గంగనపల్లి లో జనవరి 14, 1937లో జన్మించాడు. హరికథ కళాకారిణి అయిన రావు కమలకుమారితో 1966, జనవరి 16న రావుగాపాలరావు వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. ఒకసారి కాకినాడలో ఆమె హరికథ చెబుతుండగా విని ముగ్ధులై ఆమెతో ప్రేమలో పడ్డారు. తరవాత రాజమహేంద్రవరం లలితా కళానికేతన్ వాళ్ళు ఆహ్వానించిన ఉత్సవాలకు హాజరైనప్పుడు, ఆ సంస్థ సభ్యుల సమక్షంలోనే పెళ్ళి చేసుకున్నారు. ఈమె 73 సంవత్సరాల వయసులో ఏప్రిల్ 6, 2018 న హైదరాబాదులో మరణించింది.

నాటకరంగం: నాటకాలంటే ఆసక్తివున్న గోపాలరావును అతని స్నేహితులు ప్రోత్సహించడంతోపాటు ధన్యజీవులు నాటకంలోని నటనకు మంచి పేరు రావడంతో నాటకరంగంలోకి వచ్చాడు. అసోసియేటెడ్ అమెచూర్ డ్రామా కంపెనీ పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించి అనేక సాంఘిక నాటకాలను ప్రదర్శించాడు. భమిడిపాటి రాధాకృష్ణ రాసిన కీర్తిశేషులు నాటకంలో మురారి పాత్రలో ఒదిగిపోయి నటించి, అనేకమందిచే ప్రశంసలు అందుకున్నారు. నాటకరంగంలో పేరు సంపాదించి సినిమారంగంలోకి వెళ్ళినవాళ్ళు తొందరలోనే రాణిస్తారు అనేందుకు రావు గోపాలరావు ప్రత్యక్ష ఉదాహరణ. ఒకసారి రాజమహేంద్రవరంలో కీర్తిశేషులు నాటకాన్ని ప్రదర్శించినపుడు ముఖ్యఅతిథిగా వచ్చిన సినీనటుడు ఎస్.వి. రంగారావు ఆ నాటకంలో మురారి పాత్ర పోషించిన గోపాలరావు నటనకు ముగ్ధుడయ్యాడు.

సినిమారంగం సవరించు: గుత్తా రామినీడు దర్శకత్వంలో వచ్చిన భక్తపోతన (1966) సినిమాలో రంగారావు శ్రీనాథుని పాత్ర పోషించాడు. అందులో శృంగార నైషధాన్ని రాజుకు అంకితమిచ్చే ఘట్టంలో శ్రీనాథుడు రాజు కాళ్ళకు దణ్ణం పెట్టే సన్నివేషం ఉంది. ఎవరికంటే వాళ్ళకు దణ్ణం పెట్టడానికి ఇష్టపడని రంగారావు, రావు గోపాలరావు ను మద్రాసు పిలిపించి, రామినీడుకి పరిచయంచేసి అతనిచేత రాజా మామిడి శింగనామాత్యుని పాత్ర పోషింపజేసి, అతని కాళ్ళకు దణ్ణం పెట్టాడు. గోపాలరావులో ఉన్న ప్రతిభను గమనించిన రామినీడు ఆ చిత్రానికి అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పెట్టుకున్నారు. అలా రామినీడు వద్ద బంగారు సంకెళ్ళు, మూగప్రేమ చిత్రాలకు సహాయ దర్శకుడుగా పనిచేసాడు. ప్రతాప్ ఆర్ట్స్ సంస్థ నిర్మాత కె. రాఘవ, కీర్తిశేషులు నాటకం చూసి రావు గోపాలరావు కు జగత్ కిలాడీలు (1969) సినిమాలో ప్రధాన విలన్ గా అవకాశం ఇచ్చాడు. ఆ చిత్రానికి ఆయన కంఠస్వరం నచ్చక వేరొకరితో డబ్బింగ్‌ చెప్పించారు నిర్మాతలు. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించిన గండర గండడు (1969) సినిమాలో గోపాలరావు తన సొంత కంఠంతోనే పాత్రను పోషించి మెప్పించాడు. బాపు-రమణల ముత్యాలముగ్గు (1975) సినిమాలో గోపాలరావు విలక్షణ విలన్ అవతారమెత్తడమేకాకుండా గోదావరి యాసలో తను పలికే డైలాగులతోనే సినిమా విజయంలో పాలుపంచుకున్నాడు. వేటగాడు సినిమాలో ప్రాసతో కూడిన పెద్దపెద్ద డైలాగులు, వింతైన విలనీతో ఆ సినిమాకే ఒక ప్రత్యేకత కట్టబెట్టారు. ఆరోజుల్లో మిమిక్రీ కళాకారులు రావు గోపాలరావు డిక్షన్ ను అనుసరిస్తూ ఎన్నో పేరడీలు వల్లించి ఆదరణ పొందేవారు. బాపు దర్శకత్వంలో రూపొందిన భక్త కన్నప్ప, గోరంత దీపం, మనవూరి పాండవులు, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, జాకీ, బుల్లెట్‌, చిత్రాలు ఆ చిత్రాల్లోని డైలాగ్స్‌ గుర్తిండిపోతాయి. అలా గుర్తుండి పోయే డైలాగ్స్‌ని, నటనని మగధీరుడు, కొండవీటి సింహం, కొండవీటి రాజా, కిరాయి రౌడీలు, ఖైదీ, కటకటాల రుద్రయ్య, జస్టిస్ చౌదరి, గోపాలరావుగారి అమ్మాయి, ఘరానా మొగుడు, దేవాలయం, చండశాసనుడు, బొబ్బిలిపులి, బొబ్బిలి బ్రహ్మన్న, అనుగ్రహం, అల్లరి ప్రియుడు, అభిలాష, యమగోల తదితర చిత్రాల్లోనూ ప్రదర్శించారు. కేవలం విలన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హాస్యాన్ని కూడా గోపాలరావు పండించాడు. రావు - గోపాలరావు సినిమాలో నత్తి ప్రొఫెసర్ గా, పట్నం వచ్చిన పతివ్రతలు, మల్లెపువ్వు సినిమాల్లో మాలిష్ మారాజుగా, మావూర్లో మహా శివుడు సినిమాలో శివుడుగా, స్టేషన్ మాస్టర్ సినిమాలో స్టేషన్ మాస్టర్ గా రాణించారు. ముత్యాల ముగ్గులో పాత్రకు భిన్నంగా ఇంటిదొంగ సినిమాలో కంటనీరు పెట్టించే పాత్రను పోషించి మెప్పించారు. రావు గోపాలరావు వాచకానికి ప్రేక్షకులు జేజేలు కొట్టారు. దక్షిణ ఆసియాలో సినిమా సంభాషణలు, సౌండ్ ట్రాక్ తో విడుదలైన తొలి లాంగ్ ప్లే రికార్డు ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాలరావుది కావడం ఒక రికార్డు. పార్లమెంటు సభ్యునిగా ఆరేళ్ళపాటు కొనసాగారు.

రావు గోపాలరావు అభినయానికి నాటకరంగంలో ఎన్నెన్నో ఒన్స్ మోర్ లు .. వెండితెరపై సైతం ఆయన నటనావిన్యాసాలు ప్రేక్షకుల చేతులు నొప్పిపుట్టేలా చప్పట్లు కొట్టించాయి.. ఏ పాత్రలోకైనా ఇట్టే పరకాయప్రవేశం చేసి ఆకట్టుకోవడం ఆయన శైలి.. వాచకంతోనే ఆకట్టుకుంటూ వందలాది పాత్రలకు జీవం పోసి మెప్పించారు రావు గోపాలరావు.. రావు గోపాలరావు అభినయానికి ముఖ్యంగా ఆయన వాచకానికి జనం జేజేలు పలికారు.. అయితే అదే వాయిస్ ఆయనకు ఆరంభంలో శాపమయింది.. కొన్ని చిత్రాల్లో రావు గోపాలరావు గొంతు బాగుండదని ఇతరుల చేత డబ్బింగ్ చెప్పించిన సందర్భాలూ ఉన్నాయి.. బాపు-రమణ ఆయన వాచకంలోని విలక్షణాన్ని గ్రహించి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో రావు గోపాలరావును నటింప చేశారు.. రావు గోపాలరావు సాంఘికాల్లోనే కాదు పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనూ తనదైన బాణీ పలికించారు.. తెరపై ఎన్నో ప్రతినాయక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన రావు గోపాలరావు నిజజీవితంలో ఎంతో సౌమ్యులు.. రావు గోపాలరావు రాజ్యసభ సభ్యునిగానూ ఉన్నారు.. ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన రావు గోపాలరావు నటవారసునిగా రావు రమేశ్ ఈ తరం వారిని తనదైన నటనతో అలరిస్తున్నారు.. తెలుగు ప్రతినాయకుల్లో నటవిరాట్ గా జనం మదిలో నిలచిపోయారు రావు గోపాలరావు.. ఆయన స్థానం వేరెవ్వరూ భర్తీ చేయలేనిది అనడం అతిశయోక్తి కాదు.

నిర్మాతగా గోపాలరావు స్టేషన్ మాస్టర్, లారీ డ్రైవర్, భార్గవ రాముడు, వింత దొంగలు వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు విజయం సాధించారు. 1993లో ఆ ఒక్కటీ అడక్కు, అల్లరి ప్రియుడు, అల్లరి అల్లుడు, ప్రేమ అండ్ కో. అనే నాలుగు సినిమాలలో నటించాడు. గోపాలరావు నటించిన ఆఖరి చిత్రం ప్రేమ అండ్ కో. సినిమా ఆయన చనిపోయిన కొద్దిరోజుల తరవాత విడుదలైంది. గోపాలరావు 125 సినిమాలకు పైగా నటించాడు.

పురస్కారములు: ఇతనికి 1990 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) ప్రదానం చేసింది.

వ్యక్తిగత జీవితము: గోపాలరావుకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారుడు రావు రమేశ్ కూడా మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. మగధీర, కొత్త బంగారు లోకం, గమ్యం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు.

ప్రజాదారణ పొందిన సంభాషణలు; ముత్యాల ముగ్గు: సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ! ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ.. ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోస నుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏముంటది? నారాయుడూ.. ఆ ఎగస్పార్టీ వాళ్లిచ్చే డబ్బు నువ్వే ఇవ్వరా మిగిలిపోతావు అంటే వినిపించుకున్నావా? కరుసైపోయావు. కారు ఎనకసీట్లో దర్జాగా రాజాలా కూసుని ఎల్లేటోడివి. ఇప్పుడు డిక్కీలో తొంగున్నావు. దర్జా తగ్గిపోలే. ..చూడు గుర్నాధం. నీలాటోళ్ళు నన్ను బాగా పొగిడేసి బోర్లా కొట్టిన్చేస్తున్నారని బయమేసి ఈ బట్రాజు మేళం ఎట్టిచ్చాడు మా శగట్రీ. ఎవరైనా సరే పొగిడారో.. ఈళ్ళు బాజా కొట్టేస్తారు. నేను బరతం పట్టేస్తాను. అయ్ బాబోయ్.. అదేటండి అలా సూసేత్తన్నారు. ఆవిడ ఎవరనుకున్నారు? పెద్ద ఆఫీసరు భార్య.. ఇద్దరు పిల్లలు. దీన్సిగదరగ.. ఆఫీసర్ల పెళ్ళాలు డాన్సు చెయ్యకూడదేటండి! కలాపోసన. పొద్దత్తమాను తిని తొంగుంటే ఇక గొడ్డుకీ, మడిసికీ తేడా ఏటుంటాది? అంచేతే డాన్సు కోసం సెపరేషనుగా ఓ డిపార్టుమెంటే పెట్టేశాను. (కరడుగట్టిన కాంట్రాక్టరు పాత్రలో)

వేటగాడు: గాజుగదీ గాజుగదీ అనాలని మోజుపడి ప్రతిరోజూ ఆ మాటనే పోజుగా స్క్రూ లూజుగా వాడితే మనబూజు దులిపేసి గ్రీజు పెట్టేస్తారురా నిరక్షర కుక్షి. కొండయ్యగారు ఏదో ఆటకీ ఈపూట తేట తెలుగులో ఒక మాటన్నారని అలా చీటికీ మాటికీ అంటున్నారని నువ్వు సూటిగా కోపం తెచ్చుకుంటే తీట తీరిపోయి వీధిలో చాటలమ్ముకుంటూ, పాటలు పాడుకుంటూ పూటతిండి అడుక్కుని బతకాల్రా బేటా..

మనవూరి పాండవులు: కన్నప్పా! తాగి వాగుతున్నావు. ఇంటికెళ్ళి పడుకో. ఒకేళ పొద్దున్న బతికి బావుండి మేలుకున్నావనుకో.. దొరగార్ని తిట్టానని గుర్తొచ్చి మనసు పాడైపోయి సచ్చిపోతావు. పో.. ఆంజనేయ దండకం సదూకుంటూ పడుకో (దొర మూడోకన్ను తెరుచుకొని కన్నప్ప మీద కత్తి దూస్తూ)

భక్త కన్నప్ప: భక్తులారా నిన్న రాత్రి కూడా యధాప్రకారం కైలాసం వెళ్లి స్వామిని సేవించి వచ్చాను. మీ మీ కష్టసుఖాలూ, కోరికలూ వారికి మనవి చేశాను. నేను కైలాసం వెళ్ళకపోతే స్వామివారు బెంగపెట్టుకుంటారు. రా సుబ్బన్నా. నీ కష్టాల గురించి స్వామికే కాదు, అమ్మవారికి కూడా విన్నవించాను. తల్లీ.. ఇలా బతికి చితికిన కుటుంబం. వాళ్లకి మళ్ళీ దశెత్తుకోవాలంటే కరుణించక తప్పదు అని చెప్పగా వారు సరేనన్నారు. (కైలాసనాథశాస్త్రి తన భక్తులతో)

గోరంత దీపం: సర్లేవో. వేళకి తిండిలేక నీరసవొస్తే వేళాకోళమొకటి. మా సేటు నేనంటే ముచ్చటపడి చస్తాడు. రాజశేఖరం.. నువ్వారో ఘంటకి రాపోతే గడియారాలాగిపోతాయి. నా ఫ్యాక్టరీలు నడవవోయ్ అంటాడు. నువ్విలా నిలబడి ఖడేరావను.. చాలు.. వర్కర్లు ఝామ్మని పనిజేస్తారు. నువ్వింటికెల్తానంటే నాకు గుండె గాభరా అంటాడు. (రాజశేఖరం తన భార్యతో గొప్పలు చెబుతూ)

త్యాగయ్య: రాజదర్శనం త్రోసిరాజని, రాముడి పూజకోసం వచ్చేస్తావా? ఏం చూసుకొనిరా నీకా పొగరు? ఆ కండ కావరం! నాన్నగారికన్నా గొప్పవాడివా? కొత్తగా కొమ్ములు మొలిచాయా? ఆయనతో చిన్నప్పుడు రాజసభకు వెళ్ళలేదూ! అక్కడ రామాయణం చదవలేదూ (సాత్వికత ఉట్టిపడేలా)

రావు గోపాలరావు మధుమేహవ్యాధి తీవ్రమై, కిడ్నీలు చెడిపోయిన స్థితిలో 1994, ఆగష్టు 13న మరణించాడు.

Tributes to Rao Gopala Rao Vardhanthi:

Tributes to Rao Gopala Rao Vardhanthi

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement