బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలై అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన చిత్రం `వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్`. నాలుగేళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభమైన ఈ పీరియడ్ డ్రామా బడ్జెట్ సమస్యల కారణంగా ఆగిపోయిందని గతంలో ప్రచారం జరిగింది. అయితే అభిమానులను అలరించేలా ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రం ఆగిపోలేదని, సైలెంట్గా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైందని సమాచారం.
మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాతోనే అక్షయ్ కుమార్ మరాఠీలో అరంగేట్రం చేస్తుండటం విశేషం. షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో మేకర్స్ ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ , ఇతర సాంకేతిక పనులపై దృష్టి సారించారు. భారీ బడ్జెట్తో, గ్రాండ్ విజువల్స్తో రాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 1న గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వాస్తవానికి 2023 దీపావళికి విడుదల కావాల్సిన సినిమా ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పట్లో నిలిచిపోయింది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా మహేష్ మంజ్రేకర్ ప్రాజెక్ట్ను పూర్తి చేశారు. ఏడుగురు మరాఠా యోధుల సాహసగాథగా రూపొందుతున్న సినిమాలో అక్షయ్ కుమార్ సుమారు 25 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ పాత్రకు ప్రాణం పోశారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా మరాఠీలోనే కాకుండా తెలుగు, హిందీ , తమిళ భాషల్లో కూడా విడుదల కానుందని సమాచారం.




తొలి హిట్ తో సవాల్గా మారిన రెండో సినిమా
Loading..