దశాబ్ధ కాలంగా టాలీవుడ్ నిస్తేజంగా ఉండిపోయింది! రంగుల పరిశ్రమకు ఎలాంటి ప్రభుత్వ అధికారిక అవార్డులు ఇవ్వకపోవడంతో నీరసం ఆవహించింది. అవిభాజిత ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డులను యేటేటా అందించి పరిశ్రమకు జవజీవాలు నింపిన ప్రభుత్వాలు ఉండేవి. కానీ ఏపీ - తెలంగాణ డివైడ్ తర్వాత ప్రభుత్వ అవార్డులు అటకెక్కాయి. ఉద్యమం పేరుతో కొన్నేళ్ల పాటు ఆంధ్రావోళ్ల సినిమా సెట్లపై దాడులు చేసి, తగులబెట్టి కొందరు హడావుడి చేసారు. ఉస్మానియా జేఏసీ, రాజకీయాలు అంటూ చాలా రచ్చ చేసారు.
అయితే ఇలాంటి రాజకీయాలన్నిటికీ భిన్నంగా ఆంధ్రా, తెలంగాణ అనే డివైడ్ తో పని లేకుండా టిఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల పేరుతో తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు పురస్కారాల్ని అందించారు. ఆయన చేసిన ప్రయత్నంలో నిజాయితీ అందరికీ నచ్చింది. పనితనం చూపించిన ఆర్టిస్టులు, 24 శాఖలకు, మంచి సినిమాలకు అవార్డులు దక్కాయి. ఇన్నేళ్లుగా పెండింగ్ లో పడిపోయిన పురస్కారాలన్నిటినీ గంపగుత్తగా క్లియర్ చేసేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న చొరవకు ప్రశంసలు కురిసాయి. ఇక ఈ అవార్డుల కార్యక్రమానికి కొందరు పేరున్న తారలు రాకపోవడానికి కారణం వారంతా విదేశాలలో, ఔట్ డోర్ లొకేషన్లలో షూటింగుల బిజీలో ఉండటమే.
అయితే అయినదానికి కానిదానికి రచ్చ చేసే కొందరు ఈ పురస్కారాలను అందించే వేదికపైకి తెలంగాణ ప్రముఖులను ఆహ్వానించలేదని, ఆంధ్రా సినిమాలకే అవార్డుల్లో పట్టంగట్టారని కామెంట్లు చేస్తున్నారు. కొందరు మరోసారి ప్రభుత్వ అధికారిక అవార్డుల వ్యవహారంలోకి డివైడ్ పాలిటిక్స్ ని తెస్తుండడం అహేతుకంగా కనిపిస్తోంది. ఇక్కడ ఆంధ్రా సినిమానా? తెలంగాణ సినిమానా? అనే విభేధాలు ప్రజల్లో లేవు. కళను కళగా మాత్రమే చూస్తున్నారు. దీనికి డివైడ్ పాలిటిక్స్ ని అంటగట్టాలనుకోవడం సరికాదు. హైదరాబాద్ లో పరిశ్రమ ఉన్నంత కాలం అది తెలుగు సినిమాని రిప్రజెంట్ చేయడం కిందే లెక్క. ఆంధ్రా - తెలంగాణ అనే డివైడ్ ని తేకూడదు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరిగి నంది అవార్డులను పునరుద్ధరించేందుకు ఆలోచిస్తున్నారని ఏపీ ఎఫ్డిసి వెల్లడించింది. ఒకవేళ ప్రభుత్వం అధికారికంగా నంది అవార్డులు ఇస్తే, అక్కడ కూడా ఏపీ, తెలంగాణ అనే డివైడ్ సినిమాలకు వర్తించదు. ఆ ఏడాదిలో విడుదలైన గొప్ప సినిమాలకు అర్హమైనవాటికి అవార్డులను అందిస్తారు. తెలంగాణ ఆర్టిస్టులు, ఆంధ్రా ఆర్టిస్టులు అనే విభేధాలు అక్కడ కూడా వర్తించవు. బాగా నటించిన తెలంగాణ నటుడు కూడా ఉత్తమ నటుడుగా నంది అవార్డ్ అందుకోవచ్చు. నంది అవార్డులు కేవలం ఆంధ్రా వోళ్ల కోసం మాత్రమే కేటాయించినవి కావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రా, తెలంగాణ అనే వైషమ్యాలను చూడలేదు. కానీ ఆయనను ఒక సెక్షన్ కావాలనే టార్గెట్ చేయడం హాస్యాస్పదంగా మారింది.