ఇకనైనా నయనతార జీవితంలో స్థిరపడుతుందా?

అందాల మలయాళీ ముద్దుగుమ్మ నయనతార ఇకనైనా ప్రశాంతంగా తన జీవనాన్ని కొనసాగించగలుగుతుందా? ఇప్పుడందర్నీ తొలుస్తున్న ప్రశ్న ఇదే. అత్యల్ప కాలంలో అత్యధిక పాపులారిటీ సంపాదించుకోవడంలో వివాదాలూ, లవ్ ఎఫైర్లూ ఆమెకి దోహదం చేశాయి. సౌత్లో ఆమెలా వివాదాల్లో చిక్కుకున్న పాపులర్ యాక్ట్రెస్ మరొకరు లేరు. రజనీకాంత్ సరసన చేసిన ‘చంద్రముఖి’ చిత్రంతో దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన ఆమె వెంకటేశ్ జోడీగా చేసిన ‘లక్ష్మీ’ సినిమా ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది.
దుబాయ్ శీను, తులసి, బిల్లా (తమిళం) హిట్టవడంతో స్టార్ హీరోయిన్గా రూపు దాల్చింది. గోల్డెన్ స్టార్గా ఆమెకు పేరొచ్చింది. అదుర్స్, సింహా, శ్రీరామరాజ్యం వంటి తెలుగు సినిమాలు, ‘బాడీగార్డ్’ లాంటి మలయాళం మూవీ, ‘సూపర్’ లాంటి కన్నడ చిత్రం, విల్లు, ఆదవాన్, బాస్ ఎంగిర భాస్కరన్, రాజా రాణి, ఆరంభం, తని ఒరువన్, మాయ, నానుమ్ రౌడీ దాన్, కొలమావు కోకిల, ఇమైక్కా నోడిగల్, విశ్వాసమ్, మిస్టర్ లోకల్, బిగిల్, దర్బార్ వంటి తమిళ చిత్రాలు ఆమెను సూపర్ హీరోయిన్గా మార్చేశాయి.
నయనతార ప్రస్తుతం తమిళంలోనే నాలుగు సినిమాలు చేస్తోంది. వాటిలో ఒకటి రజనీకాంత్ మూవీ ‘అన్నాత్తే’ కాగా మరొకటి ‘మూకుత్తి అమ్మన్’ (అమ్మవారు) అనే డివోషనల్ ఫిల్మ్. ఈ రెండో దాంట్లో ఆమె టైటిల్ రోల్ చేస్తోంది. ‘నేత్రికన్’ అనే సినిమా సెట్స్ మీద ఉండగా, తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ‘కాదువాకుల రెండు కాదల్’ అనే మరో సినిమా చేయబోతోంది.
తొలినాళ్లో కెరీర్ దివ్యంగా సాగుతుండగా తమిళ హీరో శింబుతో ఆమె ప్రేమాయణం రచ్చకెక్కింది. ‘వల్లవన్’ (తెలుగులో ‘వల్లభ’) సినిమా ప్రమోషన్స్లో ఆమె పెదవిని శింబు కొరుకుతున్న స్టిల్స్ పెద్ద దుమారమే లేపాయి. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం దెబ్బతింది. చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి మరీ తమ మధ్య అనుబంధానికి ఫుల్స్టాప్ పడిందని ఆమె చెప్పింది.
అలా శింబుతో డేటింగ్కు చెక్ చెప్పిన ఆమె ఎంతో కాలం తిరక్కుండానే ఇండియన్ మైఖేల్ జాక్సన్గా పేరుపడిన ప్రభుదేవాతో ప్రేమలో పడింది. ఆమె కోసం భార్య లతకు దూరమయ్యాడు ప్రభుదేవా. కొంతకాలం కలిసి తిరిగిన ఇద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు కూడా. అయితే ప్రభుదేవా భార్య లత ఊరుకోలేదు. అతను నయనతారను చేసుకుంటే, తాను నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించింది. పలు మహిళా సంఘాలు ఆమెకు మద్దతుగా నిలిచి, నయనతార తమిళ సంస్కృతిని కించపరుస్తోందంటూ నిరసనలు చేపట్టాయి. ఆమె దిష్టిబొమ్మలను తగులబెట్టాయి. దాంతో 2012లో ప్రభుదేవాతో బంధాన్ని వదులుకున్నానని ప్రకటించింది నయనతార.
మూడేళ్ల తర్వాత డైరెక్టర్ విఘ్నేశ్ శివన్కు సన్నిహితమైంది నయనతార. అతను డైరెక్ట్ చేసిన ‘నానుమ్ రౌడీ దాన్’ (2015)లో హీరోయిన్గా చేసే సమయంలో ఏర్పడిన స్నేహం తర్వాత ప్రణయంగా మారింది. ఐదేళ్లుగా వాళ్ల మధ్య బంధం కొనసాగుతూ వస్తోంది. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. తాము జాలీగా కలిసి తిరుగుతున్న సందర్భాలను విఘ్నేశ్ అప్పుడప్పుడూ షేర్ చేస్తున్నాడు. త్వరలోనే ఆ ఇద్దరూ పెళ్లాడనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ బంధాన్నయినా నయన్ నిలుపుకుంటుందా?.. అని చాలామంది సందేహిస్తున్నారు. నిలుపుకోవాలనీ, ఇకనైనా ఆమె పెళ్లిచేసుకొని హాయిగా జీవితాన్ని కొనసాగించాలనీ ఆమె శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.
Actress Nayanthara and Director Vignesh Shivan are dating for five years
Actress Nayanthara and Director Vignesh Shivan Marriage soon








































