Advertisement

'సంపూర్ణ భగవద్గీత' ఆడియో పోస్టర్ విడుదల!

Sat 18th Jul 2015 12:04 PM
sampoorna bhagavadgita,ghantasala,gangadhara shastri  'సంపూర్ణ భగవద్గీత' ఆడియో పోస్టర్ విడుదల!
'సంపూర్ణ భగవద్గీత' ఆడియో పోస్టర్ విడుదల!
Advertisement

ప్రముఖ సినీ గాయకుడు, సంగీత దర్శకుడు గంగాధర శాస్త్రి ప్రారంభించిన ''సంపూర్ణ భగవద్గీతా గాన యజ్ఞం'' పూర్తయ్యి, 18 ఆడియో సీడీల రూపంలో విడుదలకు సిద్ధమయింది. అమర గాయకుడు ఘంటసాల గారు భగవద్గీతలోని ఎంపిక చేసిన 106 శ్లోకాలను మాత్రమే గానం చేయగా, హెచ్ ఎంవీ సంస్థవారు 1974, ఏప్రిల్ 21న గ్రామఫోన్  రికార్డు రూపంలో విడుదల చేసారు. ఆనాడు ఒక తెలుగు గాయకుడు ప్రారంభించిన గీతాగాన యజ్ఞాన్ని మరొక తెలుగు గాయకుడే పూర్తి చేయాలన్న సంకల్పంతో గంగాధర శాస్త్రి స్వీయ సంగీత సారధ్యంలో తెలుగు తాత్పర్య సహితంగా ''700 శ్లోకాల గీతాగాన యజ్ఞాన్ని" 2006, జూన్ 25న ప్రారంభించారు.

అవిశ్రాంత కృషి, ఆమూలాగ్ర పరిశోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుమధుర గాన మాధుర్యాల మేళవింపుగా గంగాధర శాస్త్రి చేసిన ఈ అపూర్వ ప్రయత్నం భారతీయ సంగీత చరిత్రలో సువర్ణాక్షర లిఖితం అవుతుందని వివిధ రంగాల ప్రముఖులు ప్రశంసించడం విశేషం. 8 సంవత్సరాల నిరంతర కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న ఈ సంపూర్ణ భగవద్గీత ఆడియో ఆవిష్కరణ మహోత్సవం 'జూలై 29న, హైదరాబాద్ మాదాపూర్ లోని శిల్పకళావేదిక'లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ముందు భగవద్గీత ఆడియో పోస్టర్ ను శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా..

గంగాధర శాస్త్రి మాట్లాడుతూ "ఒక గాయకుడు స్వీయ సంగీతంలో ఒక ప్రామాణిక గ్రంథాన్ని తాత్పర్య సహితంగా, సంపూర్ణంగా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేయడం భారతదేశ సంగీత చరిత్రలో ఇదే ప్రథమం. శ్రీ ఘంటసాల గౌరవార్ధం, ఆయన పాడిన 106 శ్లోకాలను యధాతథంగా గానం చేస్తూ, మిగిలిన శ్లోకాలను నా స్వీయ సంగీతంలో తాత్పర్య సహితంగా గానం చేసి 700 శ్లోకాల 'భగవద్గీత'ను సంపూర్ణంగా రికార్డు చేసాం. దాదాపు 100 మంది పండితులు, వాద్య కళాకారులు, సాంకేతిక నిపుణులు, భగవద్భందువులు ఈ ప్రాజెక్ట్ కు సహకారం అందించారు. కర్నాటక, శాస్త్రీయ, హిందుస్థానీ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీతాల మేళవింపుగా సాగే ఈ 'భగవద్గీత' శ్రోతల్ని ఆధ్యాత్మిక సంగీత ధ్యానంలోకి తీసుకువెళ్లేట్టుగా సాగుతుంది" అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో వరప్రసాద్, కవిత, పి వి ఆర్ కె  ప్రసాద్, ప్రసాద్ చౌదరి, ఎల్ బి శ్రీరాం, బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement