ఈ ఒక్కరోజే మిగిలింది..!!

CineJosh news
ఓటుకు నోటు కేసు నమోదై నెల రోజులు కావస్తోంది. ఆనాటినుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రజల మధ్య ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఇకా ఇన్నాళ్లుగా జైలులోనే ఉన్న రేవంత్‌రెడ్డి బెయిల్‌కు సంబంధించి ఈనెల 30న తీర్పు వెలువడనుంది. మరోవైపు ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని ఏసీబీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఈ కేసులో ఏసీబీ విచారించాలనుకుంటున్న సండ్ర వెంకటవీరయ్య విషయం పది రోజులుగా కొలిక్కిరావడం లేదు. తన వెన్నులో నొప్పి కారణంగా పదిరోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారని ఈనెల 19న సండ్ర ఏసీబీకి లేఖ రాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పది రోజులపాటు ఏసీబీ సండ్ర విషయాన్ని పక్కనపెట్టింది. ఇక ఆగడువు ముగుస్తుండటంతో ఇప్పటికైనా ఆయన ఏసీబీ ముందుకు వస్తారా లేక మరింత సమయాన్ని కోరుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి సండ్ర వైజాగ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నారు. ఒకవేళ ఏసీబీ ముందుకు రావడానికి ఆయన నిరాకరిస్తే.. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది..? టీ-ఏసీబీ సండ్రను బలవంతంగా అదుపులోకి తీసుకుంటుందా..? ఒకవేళ అది జరిగితే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది..? తదితర విషయాలు ఇప్పుడు సందిగ్ధంగా మారాయి. ఇక తనకు తానై సండ్రనే ఏసీబీ ముందుకు వస్తే మాత్రం ఈ చిక్కుముళ్లన్నీ వీడినట్లే..!
sandra venkata veeraiah
acb
hospital
chandrababu naidu