సొంత తమ్ముణ్ని మరిచిపోయిన జేసీ..!!

రాజకీయాల్లో జేసీ బ్రదర్స్‌ది ప్రత్యేకమైన శైలి. ఎవరికీ భయపడకుండా కుండబద్ధలు కొట్టినట్లు విషయాన్ని చెప్పే ఈ ఇద్దరు బ్రదర్స్‌ అంటే మీడియాకు కూడా చాలాఇష్టం. అందుకే ప్రతివిషయంపై వారిని కదిలించి మసాలా దట్టించి న్యూస్‌చానల్స్‌ పండుగ చేసుకుంటుంటాయి. అయితే తనకు ఎమ్‌పీ పదవిపై ఏమాత్రం ఆసక్తి లేదని జేసీ దివాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఎంపీగా కంటే కూడా ఎమ్మెల్యేగానే ప్రజలకు అధిక సేవచేయవచ్చని చెప్పారు. అంతేకాకుండా ఎమ్‌పీ పదవితో కాలం వృథా కావడమే తప్పా.. పెద్దగా ప్రయోజనం లేదని చెప్పారు. అంతేకాకుండా ఎవరైనా సిద్ధంగా ఉంటే తన ఎంపీ పదవి ఇచ్చి.. ఎమ్మెల్యే పదవికి తాను పోటీ చేయడానికి సిద్ధమని కూడా ప్రకటించారు. అయితే గతంలో కూడా పలుమార్లు జేసీకి ఎంపీగా పోటీచేసే అవకాశం వచ్చినా వద్దనుకున్నారు. ఇక ఈసారి టీడీపీలోకి వెళ్లడంతో ఆ పార్టీ అధిష్టానం సూచన మేరకు ఆయన ఎంపీగా పోటీచేయగా.. ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రినుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. మరి ఆయనకు ఎంపీ పదవిపై ఆసక్తి లేకపోతే ఇద్దరు అన్నదమ్ములు రాజీనామా చేసి దివాకర్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి.. ప్రభాకర్‌రెడ్డి ఎంపీగా పోటీచేయవచ్చు. అయితే జేసీ దివాకర్‌రెడ్డి ఎవరైనా సిద్ధంగా ఉంటే.. అంటూ తన సొంత తమ్ముణ్ని మరిచిపోయినట్లు కనిపిస్తోంది.