పవన్‌ కల్యాణ్‌ ఇదైతే చేశాడు..!!

ఎన్నికలకు ముందు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగిన పవన్‌కల్యాణ్‌ ఆ తంతు ముగియగానే పత్తాలేకుండాపోయారు. పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినీ లైఫ్‌లో బిజీగా మారిపోయారు. అడపాదడపా ఆర్నెళ్లకోసారి రాజకీయాంశంలపై ఆయన స్పందిస్తున్నారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా దక్కదని స్పష్టమైన తర్వాత కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు. అయితే తన సొంత పనులను చక్కబెట్టుకోవడంలో మాత్రం పవన్‌కల్యాణ్‌ యమబిజీగా ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అడుగడుగునా ఏపీ ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోని పవన్‌.. తన సన్నిహితులకు మాత్రం న్యాయం చేయడంతో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవన్‌ సిఫార్సు మేరకే టీటీడీ బోర్డులో పసుపులేటి హరిప్రసాద్‌కు సభ్యత్వం లభించిందని సమాచారం.

 

టీటీడీ బోర్డులో సభ్యత్వం కోసం గతంలో ఎన్నడూ లేనంతా పోటీ ఏర్పడింది. స్వయంగా బీజేపీ అధ్యక్షుడు కూడా తనవారికి సభ్యత్వం ఇవ్వాలని చంద్రబాబుకు సిఫార్సు చేసినట్లు సమాచారం. అటు టీడీపీ పార్టీలోనూ.. మిత్రపక్షం బీజేపీనుంచే కాకుండా పక్క రాష్ట్రాలనుంచి కూడా సభ్యత్వం కోసం భారీ సంఖ్యలో సిఫార్సులు అందాయి. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా తమ అనుచరులకు టీటీడీలో సభ్యత్వం కోసం పైరవీలు చేశారు. ఇంతటి పోటీ మధ్య కూడా పసుపులేటి హరిప్రసాద్‌కు చోటుదక్కడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. గతంలో హరిప్రసాద్‌ ప్రజారాజ్యం పార్టీలో ఉండేవారు. అప్పటినుంచి అతడు పవన్‌కు సన్నిహితుడిగా మెలుగుతున్నట్లు తెలిసింది. ఇంతటి పోటీ మధ్య కూడా పవన్‌ తన సన్నిహితుడైన హరిప్రసాద్‌కు టీటీడీ సభ్యత్వం దక్కేలా చేశారంటే గ్రేటే. మరి ఇదే శ్రద్ధ పవన్‌ ఏపీ ప్రజలపై ఎందుకు పెట్టడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.