Advertisement

వికారుద్దీన్‌ మృతితో పోలీసుల పరువు దక్కిందా..??

Wed 08th Apr 2015 09:34 AM
vikaruddin,counter,telangana,law and order  వికారుద్దీన్‌ మృతితో పోలీసుల పరువు దక్కిందా..??
వికారుద్దీన్‌ మృతితో పోలీసుల పరువు దక్కిందా..??
Advertisement

నల్గొండ జిల్లాలో ఈ నాలుగు రోజులు తీవ్ర సంచలనాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మొదట ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు పోలీసులు మృతిచెందగా.. ఆ తర్వాత ఆ ఇద్దరు టెరరిస్ట్‌లను కూడా పోలీసులు మట్టుబెట్టారు. అంతలోనే వికారుద్దీన్‌తోపాటు మరో ముగ్గుర్ని కూడా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం సంచలనంగా మారింది. నిజంగానే వికారుద్దీన్‌ గ్యాంగ్‌ పోలీసుల చెర నుంచి తప్పించుకోవాలని చూసిందా..? లేక పోలీసులే ఎన్‌కౌంటర్‌ చేసి కట్టుకథ అల్లారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీస్‌ యంత్రాంగం కాస్త పటిష్టమైంది. ఆయన కొత్త వాహనాలు ఇప్పించడమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వని విధంగా పెట్రోలుతోపాటు స్టేషనరీకి కూడా నిధులు మంజూరుచేశారు. అదే స్థాయిలో పోలీసులు కూడా పెట్రోలింగ్‌ తదితర చర్యలతో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.

 

         ఈ తరుణంలో సూర్యాపేటలో కాల్పుల సంఘటన కలకలంరేపింది. కేవలం ఇద్దరు ఉగ్రవాదులు రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగాన్ని గడగడలాడించారు. బస్టాండ్‌లో కాల్పుల తర్వాత వారి కోసం 17 టీంలు రంగంలోకి దిగినా.. మూడుసార్లు ఎదురు కాల్పులు జరిగినా.. నలుగురు పోలీసులను కోల్పోయికాని ఆ ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టలేకపోయారు. దీంతో తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి గురించి.. పోలీస్‌ యంత్రాంగం పటిష్టత గురించి అనుమానాలు మొదలయ్యాయి. ఇక పోలీసులపై మళ్లీ నమ్మకం రావాలంటే ఓ సంచలనాత్మక సంఘటన కోసం ఎదురుచూడటం ఖాయం. అదే సమయంలో వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌తో పోయిన పరువును పోలీసులు మళ్లీ తిరిగి సంపాదించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అన్న అనుమానాలు తలెత్తాయి. ఒకవేళ ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అయితే పోలీసుల ప్రయత్నం బెడిసికొట్టిందనే చెప్పాలి. బేడీలు వేసి ఉన్న టెర్రరిస్ట్‌లను కాల్చిచంపి ప్రజల నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాలనుకోవడం అత్యాశేనని పలువురు మాజీ పోలీస్‌ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement