Advertisement

ఈ చిక్కుముడిని చంద్రబాబు ఎలా విప్పుతారో?

Sat 14th Mar 2015 06:49 AM
chandra babu naidu,contractors,andhra pradesh,tdp,bjp  ఈ చిక్కుముడిని చంద్రబాబు ఎలా విప్పుతారో?
ఈ చిక్కుముడిని చంద్రబాబు ఎలా విప్పుతారో?
Advertisement

రాష్ట్రాన్ని నడిపిస్తున్న కాంట్రాక్టర్లు - పారిశ్రామిక వేత్తలు

కేంద్రంలో - రాష్ట్రంలో అధికారంలోనున్న మిత్ర పక్షాలు బిజెపి - టిడిపి మధ్య నిప్పు రాజుకుంది. నిధులు రాకలో జాప్యానికి కారణం నిధుల పంపిణీ - తకరారు మొదలయిందంటున్న పాత్రికేయులున్నారు. వారి కధనం :

ఉభయ సభలలో బిజిపి - టిడిపి - కాంగ్రెసు నాయకుల వివరాలు చూడండి : కోటీశ్వరులు - బడా బడా పారిశ్రామిక వేత్తలు - పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఎక్కువగా కనిపిస్తారు. ప్రత్యేకించి రాజ్యసభలో వీరి సంఖ్య గణనీయంగా కనిపిస్తుంది. ప్రభుత్వాలను, పారిశ్రామిక విధానాన్ని, ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తున్న వారిలో వీరి పాత్రని  విస్మరించలేం.

ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగింది. రాజధాని - పోలవరం ప్రాజెక్టు - రోడ్లు - విద్య వైద్య సంస్ధలు - వంతెనలు - రైలు మార్గాలు - నౌకా కేంద్రాలు - విమానాశ్రయాలు - నీటి వసతులు - విద్యుత్తు : లక్షలకోట్ల పెట్టుబడులు, పనికి పని, కోట్ల టర్నోవర్‌, నిరుద్యోగం సమసిపోతుంది, ఆకలి కేకలు అదృశ్యమవుతాయి, చేసుకున్న వారికి చేసుకున్నన్ని కాంట్రాక్టులు, హోటల్‌ - టూరిజం - ట్రాన్స్‌పోర్టు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది.

- ఊహల పల్లకిలో ఊరేగారు.

ఎన్నికలముందే కాంగ్రెసు గల్లంతవుతుందని భావించిన బడాబడా నేతలు పార్టీ ఫిరాయించారు. కొందరు తెలుగుదేశం పార్టీలో చేరితే మరికొందరు జాతీయ పార్టీ బిజెపీ తీర్ధం పుచ్చుకున్నారు. అందరిలక్ష్యం ఒక్కటే : అధికార పీఠం, కాంట్రాక్టులు సంపాదించడం. వీరిలో అత్యధికులు జగన్‌ని నమ్మలేదు. ‘క్లీన్‌ ఇమేజ్‌ వున్న నాయకుడు కావాలి - విజన్‌వున్న నాయకత్వం రావాలి - నమ్మదగిన నాయకుడు కావాలి - ఆర్ధిక నేరగాళ్ళని దగ్గరకు రానివ్వని నాయకుడు కావాలి’ అంటూ ప్రజలలో ఒక ఫీల్‌ తీసుకొచ్చారు. పరోక్షంగా చంద్రబాబుని ప్రమోట్‌ చేశారు. 

కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చాయి. కానీ చంద్రబాబు సింగపూర్‌, జపాన్‌, అమెరికా - బృందాలు అంటూ ప్రపంచస్థాయి నిర్మాణాలకు తెగువ చూపడంతో వ్యవహారం బెడిసికొట్టింది. వ్యాపార ప్రయోజనాలు ఆశించి ఎన్నికలలో చంద్రబాబుని ప్రమోట్‌ చేసినవారే నిధుల ప్రవాహానికి మోకాలడ్డవలసిన పరిస్థితి ఏర్పడిరది. ఫలితంగా అన్ని విధాలా ప్రతిష్టంభన: ఆరోపణలు, మిత్రలాభం - మిత్ర భేదం - మిత్ర ఖేదం!

   స్ధల సేకరణ నుంచి నిధులు రాబట్టడం - రాజధాని నిర్మించడం వరకు చంద్రబాబు ముందు ఎన్నెన్నో సవాళ్ళు!

రాజకీయం కార్పొరేట్‌ రంగుపులుముకున్న తర్వాత ఈ ధన స్వామ్యంలో వ్యక్తిగత - సంస్థ ప్రయోజనాలదే ప్రధమ స్ధానమయింది. ఎన్నికలముందు, గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయింపులు సాధారణమయింది. పాతివ్రత్య పరీక్షలు - కన్యత్వ పరీక్షలు నిషేధింపబడిన ఈ వ్యవస్థలో రాజకీయం వ్యాపార వస్తువయింది. చూద్దాం - ఈ చిక్కుముడిని చంద్రబాబు ఎలా విప్పుతారో!

 - తోటకూర రఘు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement