నేను పారిపోలేదు.. నాకే డబ్బులు రావాలి: మాల్యా
Vijay Mallya gives absurd reason for not returning to India, gets trolledభారత బ్యాంకింగ్ వ్యవస్థను ముంచేసి దేశం దాటిపోయాడనే ప్రచారాన్ని వ్యాపారవేత్త విజయ్ మాల్యా తీవ్రంగా ఖండించారు. తనను `మోసగాడు` లేదా `పారిపోయిన వ్యక్తి`గా చిత్రీకరించడం తప్పు అని అన్నాడు. దీని వెనుక ఎలాంటి నిజం లేదని.. అసలు వాస్తవాలను మీడియా తొక్కిపెడుతోందని ఆయన ఆరోపించారు.
డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) లెక్కల ప్రకారం తాను చెల్లించాల్సిన అసలు- వడ్డీ మొత్తం కలిపి 10,230 కోట్లు మాత్రమేనని స్పష్టం చేసిన మాల్యా... బ్యాంకులు మాత్రం అంతకు మించి 14,131 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసుకున్నాయని తెలిపారు. జప్తు చేసిన ఆస్తుల విలువ ఆధారంగా చూస్తే.. బ్యాంకులే తనకు ఇంకా 6,722 కోట్లు రిఫండ్ ఇవ్వాల్సి ఉందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సరికొత్త లెక్కలను తెరపైకి తెచ్చారు.
తాను భారతదేశానికి రాకపోవడానికి చట్టపరమైన ప్రక్రియలే ప్రధాన కారణమని.. అంతేకానీ విచారణకు భయపడి కాదని మాల్యా స్పష్టం చేశారు. 1992 నుంచే యుకే లో శాశ్వత నివాసిగా ఉంటున్న తనపై అక్కడి న్యాయస్థానాలు విధించిన దేశ దాటకూడదనే ప్రయాణ నిషేధం అమలులో ఉందన్నారు.
చట్టపరమైన ఈ అడ్డంకి వల్లే తాను భారతదేశానికి తిరిగి రాలేకపోతున్నానని.. దీనిని కావాలనే కొందరు పారిపోయాడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు ఇలాంటివి ఉండగా.. మీడియా తన వర్షన్ను పట్టించుకోకుండా కేవలం ఏకపక్షంగా ముద్ర వేయడమేంటని ఆయన నిలదీశారు.







































