విమానం కూలి చనిపోతాననే భయంతో

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరణభయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిగ్గా మారింది. తనకు విమాన ప్రయాణాలు అంటే తీవ్రమైన మరణ భయం ఉందని, అందుకే ప్రతి ప్రయాణానికి ముందు దర్శకుడు మన్సూర్ ఖాన్కు ఒక ప్రత్యేక లేఖ (నోట్) రాసి పెడతానని అమీర్ వెల్లడించారు.
ఒకవేళ విమాన ప్రమాదంలో తాను మరణించినా, షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న తన సినిమాలు ఆగిపోకూడదనేది ఆయన ప్రధాన ఉద్దేశం. తన తదనంతరం ఆ చిత్రాల పర్యవేక్షణ బాధ్యతను మన్సూర్ ఖాన్ స్వీకరించాలని.. దర్శకులు ఆయన సలహాలు పాటించాలని అమీర్ ఆ లేఖలో స్పష్టంగా పేర్కొంటారు. తన సినిమాల పై ఉన్న ఈ విపరీతమైన బాధ్యతాయుతమైన ఆలోచనే అమీర్ను అందరికంటే భిన్నంగా నిలబెడుతోంది.
మన్సూర్ ఖాన్ క్రియేటివ్ సెన్స్పై ఉన్న అపారమైన నమ్మకంతోనే అమీర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన మాజీ భార్య కిరణ్ రావుకు కూడా ఈ విషయాన్ని ముందే తెలియజేసి.. అత్యవసర సమయాల్లో మన్సూర్ సలహాలు తీసుకోవాలని సూచించారు. గతంలో వీరిద్దరి మధ్య `జోష్` సినిమా విషయంలో చిన్నపాటి విభేదాలు వచ్చినా.. వ్యక్తిగతంగా మన్సూర్ను అమీర్ తన అతిపెద్ద సపోర్ట్ సిస్టమ్గా భావిస్తారు.
ప్రస్తుతం అమీర్ కుమారుడు జునైద్ ఖాన్ నటిస్తున్న`ఏక్ దిన్` సినిమాకు కూడా మన్సూర్ మార్గదర్శిగా వ్యవహరిస్తున్నారు. కేవలం బాక్సాఫీస్ అంకెలే కాకుండా.. ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకోవడమే అసలైన విజయమని నమ్మే అమీర్, తన మరణానంతరం కూడా తన చిత్రాల నాణ్యత తగ్గకూడదని ఇంతటి ముందుచూపుతో ప్లాన్ చేయడం గమనార్హం.








































