టాలీవుడ్ లో ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన `తూనీగ తూనీగ` చిత్రంలో నటించింది రియా చక్రవర్తి. అటు బాలీవుడ్ లోను రియా దశాబ్ధ కాలంగా నటనా కెరీర్ ని కొనసాగిస్తోంది. కానీ 2020లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం ఈ భామ జీవితాన్ని అనూహ్య మలుపులు తిప్పింది. సుశాంత్ సింగ్ బలవన్మరణానికి పాల్పడటంతో, ఈ కేసులో అతడి ప్రియురాలిగా ఉన్న రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సహా పోలీస్ వ్యవస్థలు విచారించాయి.
సుశాంత్ సింగ్ కేసు డ్రగ్స్ సంబంధితమైనది కావడంతో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తీవ్రంగా విచారించింది. సుశాంత్ సింగ్ ఆర్థిక వ్యవహారాల్లోను రియా చక్రవర్తి ప్రమేయం గురించి కొన్ని నెలల పాటు సంబంధిత అధికారులు విచారించారు. పలు ఏజెన్సీలు వరుసగా దర్యాప్తు చేపట్టాయి. కానీ ఈ కేసులో రియా చక్రవర్తి తనను తాను నిర్ధోషిగా నిరూపించుకుని బయటపడ్డారు. రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇద్దరికీ సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.
అయితే దాదాపు ఐదేళ్ల పాటు రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు మానసికంగా తీవ్ర భావోద్వేగాన్ని ఎదుర్కొన్నారు. తాజా సమాచారం మేరకు అధికారులు రియా చక్రవర్తి పాస్ పోర్ట్ ను తిరిగి అందజేసారు. దీంతో ఉద్వేగానికి లోనైన రియా .. లెక్కలేనన్ని పోరాటాలు, అంతులేని ఆశ.. అంటూ ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసింది.
రియా తన ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసారు. ``గత 5 సంవత్సరాలుగా ఓపిక నా ఏకైక పాస్పోర్ట్. లెక్కలేనన్ని పోరాటాలు. అంతులేని ఆశ. ఈ రోజు నేను మళ్ళీ నా పాస్పోర్ట్ను పట్టుకున్నాను. చాప్టర్ 2కి సిద్ధంగా ఉన్నాను! సత్యమేవ జయతే... అని రాసారు. ఇకపై రెండో అధ్యాయం మొదలు పెట్టడానికి రియా సిద్ధంగా ఉంది. టాలీవుడ్ లేదా బాలీవుడ్ నుంచి ఎవరైనా అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తారా? అన్నది చూడాలి.