90లలో ఖాన్ల త్రయం బాలీవుడ్ని ఏలేది. కానీ ఆ సమయంలో వారంతా ముంబై మాఫియా కనుసన్నల్లో భయపడి జీవించాల్సి వచ్చింది. అప్పట్లోనే కమల్ హాసన్ కూడా బాలీవుడ్ ని వదిలి సౌత్ కి వచ్చేయడానికి మాఫియా బెదిరింపులే ప్రధాన కారణమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కి కూడా మాఫియా కారణంగా అలాంటి పరిస్థితి ఏర్పడిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అంగీకరించాడు. ముంబై అండర్ వరల్డ్ తనను కలిసేందుకు చాలా ప్రయత్నించింది. తనను ఆఫీసులో నెలలుగా కలుస్తూనే ఉన్నారు. తనను దుబాయ్ లో ఓ పార్టీకి అటెండవ్వాల్సిందిగా ఆహ్వానించారు. అయితే అతడు మొదటి నుంచి దానిని తిరస్కరిస్తూనే ఉన్నాడు. చివరికి పార్టీలో అతిథిగా అమీర్ ఖాన్ పేరును అనౌన్స్ చేసామని, తప్పనిసరిగా విధిని ఫాలో కావాలని కూడా వార్నింగ్ ఇచ్చారట.
ఆ సమయంలో తాను భయపడ్డానని అమీర్ అన్నారు. తనకు కుటుంబం ఉంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందుకే ఆలోచించానని అమీర్ ఖాన్ తెలిపారు. అయితే తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. తాను మాఫియా పార్టీకి రాలేనని చెప్పాడు. అక్కడికి వస్తే తన కాళ్లు కట్టేస్తారని, బుర్రపై బాదేస్తారని, తనను ఏదైనా చేయగలరని భయపడినట్టు వారికి చెప్పాడట. చివరికి తెగేసి నేను రాలేనని ఆహ్వానాన్ని తిప్పి కొట్టాడు. డబ్బు ఎరవేసి ఎలాగైనా పార్టీకి రప్పించాలని గట్టిగానే ప్రయత్నించారు. కానీ దానిని కూడా తిరస్కరించాడు. మొత్తానికి అలా అప్పటికి అమీర్ బయటపడిపోయాడు.
మాఫియా విషయంలో దృఢంగా ఉన్నప్పటికీ, తాను భయపడ్డానని అమీర్ ఖాన్ ఒప్పుకున్నాడు. తన కోసం కాదు, తన కుటుంబం కోసం. అప్పుడు రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. నా తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందారు. మీరేం చేయగలరు? వారు చాలా ప్రమాదకరమైనవారు అని కుటుంబ సభ్యులు భయపడ్డారు. కాబట్టి నేను వారికి ఒకే ఒక్క విషయం చెప్పాను. నేను నా జీవితాన్ని కోరుకున్న విధంగా గడపాలనుకుంటున్నాను. నేను అక్కడికి వెళ్లాలనుకోవడం లేదు అని చెప్పినట్టు ఆయన గుర్తు చేసుకున్నారు. నాకు నా కుటుంబం బంధువుల విషయంలో ఆందోళన చెందాను అని అన్నారు.