రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. నిర్మాత దిల్ రాజు రాజీ అన్నదే లేకుండా పెట్టుబడి పెట్టారు. కానీ ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. శంకర్ వర్కింగ్ స్టైల్ గురించి చాలా రూమర్లు ఉన్నా, అవేవీ పట్టించుకోకుండా దిల్ రాజు సాహసం చేసారు. కానీ ఈ సాహసానికి తగిన ఫలితాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
`గేమ్ ఛేంజర్`ని తప్పటడుగు అని అన్నారు దిల్ రాజు. ఈ సినిమా కోసం ఏడు గంటల నిడివి ఉన్న ఫుటేజ్ ని శంకర్ చిత్రీకరించారని ఎడిటర్ షమీర్ అహ్మద్ ఇంతకుముందు అన్నారు. దానిని మూడున్నర గంటలు కోత కోయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత నాలుగున్నర గంటల నిడివి ఉన్న సినిమాని ఇంకా ఇంకా ఎడిట్ చేసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. దీనిని బట్టి శంకర్ తన మేకింగ్ కోసం డబ్బును ఏ స్థాయిలో ఖర్చు చేయించారో అర్థం చేసుకోవచ్చు.
అయితే శంకర్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకునే ముందు తన కండీషన్స్ ఏమిటో దానిలో పొందుపరచడంలో విఫలమయ్యానని దిల్ రాజు అంగీకరించారు. నిర్మాణ సమయంలో జరిగిన తప్పులకు దిల్ రాజు కూడా పూర్తి బాధ్యత వహించారు. ``నా సినీ కెరీర్లో శంకర్ లాంటి పెద్ద దర్శకులతో ఎప్పుడూ పని చేయలేదు. గేమ్ ఛేంజర్ నా మొదటి తప్పటడుగు. నేను కాంట్రాక్టులో నా వైపు నుంచి అంశాలను స్పష్టంగా ప్రస్తావించి నిర్మాణంలోకి అడుగుపెట్టాల్సింది.. కానీ నేను అలా చేయలేదు.. ఇది నా తప్పు`` అని అన్నారు. ప్రతి పెద్ద దర్శకుడితో నిర్మాతకు వంద శాతం సమస్యలుంటాయని కూడా దిల్ రాజు వ్యాఖ్యానించారు. `గేమ్ ఛేంజర్`తో దిల్ రాజు మాత్రమే కాదు, రామ్ చరణ్ కూడా తప్పటడుగు వేసానని గ్రహించారు. ఇప్పుడు దానిని సరి చేసేందుకు చరణ్ ప్రయత్నిస్తున్నాడు.