సముద్ర తీరంలో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సిఆర్జెడ్) పరిధిలో ఒక భవనం నిర్మాణం లేదా పునర్నిర్మాణం చేయాలంటే చాలా చిక్కులు ఉన్నాయి. సముద్రపు పరిసరాల్లో భూములను అన్యాక్రాంతం చేసినా చాలా చట్టాల ప్రకారం శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. కానీ కొందరు పెద్దలు మున్సిపల్ అధికారులను మ్యానేజ్ చేసి, తమ ఇష్టానుసారం ఈ భూముల్లో నిర్మాణాలు చేపట్టడం బయటపడుతూనే ఉంది.
అయితే కింగ్ ఖాన్ షారూఖ్ `మన్నత్` కూడా ఇలాంటి ఫిర్యాదులను ఎదుర్కొంటోంది. గత కొంతకాలంగా ఖాన్ సొంత భవంతి మన్నత్ ని రెనోవేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ఇంటిని మరింత అదనంగా విస్తరిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికోసం ప్రభుత్వాధికారుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని ఇంతకుముందు షారూఖ్ - గౌరీ ఖాన్ దంపతులు ప్రకటించారు. కానీ సీ.ఆర్.జెడ్ పరిధిలోని ఈ ఇంటి విస్తరణ పనుల్లో నియమాలను ఉల్లంఘించారని వైపి సింగ్ అనే యాక్టివిస్ట్ బీఎంసి, ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు నిర్మాణం ఇబ్బందుల్లో పడినట్టు తెలిసింది.
బాంద్రా బ్యాండ్ స్టాండ్ లో ఉన్న మన్నత్ విలువ సుమారు రూ.200 కోట్లు. దీనిని మరో 100 కోట్లతో భారీగా విస్తరించేందుకు షారూఖ్ టీమ్ ప్లాన్ చేసింది. మన్నత్ ప్రధాన బంగ్లా వెనకగా ఉన్న ఎకరాల భూమిలో మొత్తం 12 మినీ ఇండ్లను నిర్మించేందుకు అనుమతులు ఉన్నాయి. కానీ వీటన్నిటకీ షారూఖ్- గౌరీ యజమానులుగా ఉన్నారు. వారు అధికారులను మ్యానేజ్ చేసి, ఇప్పుడు ఆ 12 గృహ సముదాయాలను ఒకే నివాసానికి ఆయోగ్యమైన ఇల్లుగా రూపొందించారనేది వైపి సింగ్ ఆరోపణ.
అయితే ఈ నిర్మాణంలో సమస్యలు ఏమిటన్నది పరిశీలించేందుకు అటవీశాఖ అధికారులు, ముంబై మున్సిపల్ అధికారులు ఇప్పటికే స్థలాన్ని సందర్శించారు. ప్రస్తుతం దీనిపై నివేదికను ఇచ్చేందుకు వారు రెడీ అవుతున్నారు. మన్నత్ బీచ్ పరిసరాల్లో ల్యాండ్ సీలింగ్ పరిధిలో ఉంది. అక్కడ ఏ పని చేయాలన్నా దానికి అధికారుల అనుమతి తప్పనిసరి. వైపి సింగ్ ఫిర్యాదుతో ఖాన్ బంగ్లా నిర్మాణం సమస్యల్లో పడింది. మన్నత్ అదనపు నిర్మాణానికి అడ్డంకులేమిటి? ల్యాండ్ సీలింగ్ మారిన రూల్స్ ఏమిటన్నది కూడా ఈ అంశంలో మరింత స్పష్టంగా తెలియాల్సి ఉంది.