బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో ఒకరికొకరు ఎదురు పడితే హోరా హోరీ ఎలా ఉండాలి? జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న ఇద్దరు పెద్ద స్టార్లను ఎలా చూపించాలి? ఏ ఒక్కరిని తక్కువ చేసినా అది ఫ్యాన్స్ కు నచ్చదు. చాలా రచ్చవుతుంది. అయితే ఈ ఆలోచనే తనను నిలవనీయలేదని, చాలా భయపెట్టిందని అంగీకరించాడు వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఆ ఇద్దరూ తెరపై ఒకరికొకరు ఎదురుపడితే ఘర్షణ పడే వాతావరణం సృష్టించడానికి తనకు చాలా ఎక్కువ సమయం పట్టిందని, దానికోసం చాలా హార్డ్ వర్క్ చేసానని చెబుతున్నాడు.
ఇద్దరు పెద్ద స్టార్లు.. నువ్వా నేనా? అంటూ ఢీకొట్టాలంటే సరైన ఘర్షణ వాతావరణం సృష్టించాలి. దానికోసం ఎక్కువ ఆలోచించానని, సమయం తీసుకున్నానని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. వార్ 2 డిలేకు ఇది కూడా ఒక ప్రధాన కారణమని అయాన్ ముఖర్జీ అంగీకరించాడు. ఓవైపు కథను అద్భుతంగా చెబుతూనే, ఆ ఇద్దరు స్టార్లను నెవ్వర్ బిఫోర్ అనే విధంగా చూపించడమే తన ముందున్న సవాల్ అని అతడు అన్నాడు.
ఆ ఇద్దరినీ తెరపై చూస్తున్నంత సేపు కళ్లు తిప్పుకోనివ్వనంత ప్రత్యేకంగా ఆవిష్కరించామని కూడా అయాన్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసాడు. హృతిక్ వర్సెస్ తారక్ యాక్షన్ ఎపిసోడ్స్ నభూతోనభవిష్యతి అన్న తీరుగా అందరినీ అలరిస్తాయని నమ్మకాన్ని కనబరిచాడు. మొత్తానికి అయాన్ ముఖర్జీ ఇద్దరు పెద్ద స్టార్లతో సవాల్ ని స్వీకరించానని చెబుతున్నాడు. కానీ పెద్ద తెరపై ఏ మేరకు నిరూపిస్తాడో వేచి చూడాలి. వార్ 2 ఆగస్టులో విడుదల కానుంది.