ప్రముఖ నిర్మాత మధు మంతెన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ తో సుదీర్ఘ కనెక్షన్ ఉన్న నిర్మాత. ఆయన వందల కోట్ల బడ్జెట్లను వెదజల్లి పెద్ద స్టార్లతో సినిమాలు తీసారు. ఇప్పటికీ బాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన `మ్యాడ్ మ్యాన్` అనే కొత్త బ్యానర్ స్థాపించి ఈ బ్యానర్ లో వరస చిత్రాలను నిర్మించే యోచనలో ఉన్నారు.
అయితే ఈ బ్యానర్ లో రొటీన్ సినిమాలు తీసే ఆలోచన లేదని, ఫలానా సంస్థలో తీసిన సినిమాలా ఉందని అనలేరని భరోసానిస్తున్నారు. ఆయన ఈ బ్యానర్ లో భారీ యాక్షన్ చిత్రాలను నిర్మించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు! అనిపించే సినిమాలు తీయాలనేది ఆయన లక్ష్యం. ప్రస్తుతం ఈ బ్యానర్ లో సినిమాలు నిర్మించేందుకు కొందరు హీరోలతో చర్చలు సాగిస్తున్నారు. ఒక పెద్ద హీరోతో సినిమా, అలాగే యువహీరోలతో అద్భుతమైన యాక్షన్ సినిమా తీయాలని మధు మంతెన భావిస్తున్నట్టు హిందీ మీడియాలు పేర్కొన్నాయి. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. సందీప్ వంగా `యానిమల్` లాంటి భారీ యాక్షన్ చిత్రం సాధించిన పాన్ ఇండియా విజయం మధు మంతెనను ఆ దిశగా సినిమాలు తీసేందుకు ప్రేరేపించిందని అంతా ఊహిస్తున్నారు. అతడు సందీప్ వంగాతోను పని చేసేందుకు ఆస్కారం ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
మధు మంతెన గతంలో గజిని హిందీ వెర్షన్ ని అల్లు అరవింద్ తో కలిసి నిర్మించారు. ఆ సినిమా హిందీ చిత్రసీమలో తొలి 100 కోట్ల క్లబ్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాతా అరవింద్ తో ఆయన భాగస్వామ్యం కొనసాగుతోంది.