కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ప్రజలకు లబ్ది చేకూరేలా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేర్చుతుంది. అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచి పేద, పెద్ద వారికి అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత దీపం పథకం,మెగా డిఎస్సి లాంటి వాటిని నెరవేర్చింది. ఇప్పుడు ఏపీ లో అత్యంత కీలక ఘట్టాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీలోని పేద పిల్లకు తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది.
నిన్న జూన్ 12 నుంచి తల్లికి వందనం పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో, ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న ప్రతి బిడ్డకూ ప్రతి ఏడాది తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నారు.
గతంలో జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకంలో కుటుంబానికి ఒకరికి మాత్రమే ఈ 15,000 పరిమితం కాగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకూ ప్రయోజనం చేకూరేలా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అర్హత పొందిన ప్రతి తల్లి ఖాతాలో డీబీటీ విధానంలో సంవత్సరానికి రూ. 15,000 జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కోసం మొత్తం రూ. 8,745 కోట్లు కేటాయించినట్లు తెలిపింది.
చెప్పిన విధంగా... ఇచ్చిన మాట ప్రకారం ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి అంటూ టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసారు. అంతేకాదు ఇప్పటికే తల్లికి వందనం పథకం కింద తమ ఖాతాల్లో జమ అయిన డబ్బు చూసుకుని లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలుపుతున్నారు.