అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో టేకాఫ్ అయిన రెండు నిమిషాల్లోనే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి క్రాష్ అయిన ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న నిమిషాల వ్యవధిలో కుప్పకూలిపోవడం అందరికి షాకిచ్చింది.
230 మంది ప్రయాణికులతో లండన్ వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అవ్వగానే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఫ్లైట్ కూలిపోయిన క్షణమే మంటలు అంటుకుని ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న మొత్తం 230 మంది ప్రయాణికులతో పాటుగా విమాన సిబ్బంది చనిపోవడం అత్యంత బాధాకర విషయం. ఈమధ్య కాలంలో కనివిని ఎరుగని సంఘటన ఇది.
విమానంలో పైలట్లు, సహాయక సిబ్బంది మొత్తం 12 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు ఉండగా, మిగతా 53 మంది బ్రిటిషర్లు, 7 మంది పోర్చుగీస్ వారు, ఓ కెనడియన్ ఉన్నారు. ప్రయాణికుల్లో ఇద్దరు పసిపిల్లలతో పాటు 12 మంది చిన్నారులు ఉన్నారు. విమానంలోని భారీ స్థాయిలోని ఉన్న ఫ్యూయల్ విమానాన్ని, అది కూలిన పరిసరాలను దగ్ధం చేసింది.
విమానం కుప్పకూలిన ప్రదేశం అంతా శవాల గుట్టలతో భీకర వాతావరణాన్ని తలపిస్తుంది. ఇటు ఫ్లైట్ కూలడమే షాకింగ్ విషయం అనుకుంటే ఆ విమానం జనావాసాలు ముఖ్యంగా మెడికల్ విద్యార్థుల హాస్టల్ పై కూలడంతో 40 మందికి పైగా మెడికోలు మరణించినట్లుగా తెలుస్తుంది. విమానంలోని వారు ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు. ఈ ప్రమాద మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు.