రంగుల ప్రపంచంలోని ఒక సాధారణ నటి, దేశంలో ఎంతో గొప్ప పాపులారిటీ ఉన్న ఒక ముఖ్యమంత్రి కొడుకును ప్రేమించి పెళ్లాడటం అంటే అంత సులువా? కానీ తనకు అలాంటి గట్స్ ఉన్నాయని నిరూపించింది జెనీలియా. తన ప్రేమికుడు రితేష్ దేశ్ముఖ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్రావు దేశ్ ముఖ్ కుమారుడు. రాజకీయ నేపథ్యం ఉన్న ఒక బడా కుటుంబం నుంచి వచ్చిన నటుడిని ప్రేమించి పెళ్లాడింది జెనీలియా. ఈ జంట ప్రేమ పెళ్లి ఒక సినిమా కథకు ఎంతమాత్రం తక్కువ కాదు. చాలా కాలం పాటు హైడ్ అండ్ సీక్ గేమ్ తర్వాత పెళ్లితో ఒకటయ్యారు. ఈ జంట ఇప్పుడు ఇద్దరు అందమైన పిల్లలకు తల్లిదండ్రులు.
అయితే కెరీర్ పరంగా పీక్స్ లో ఉండగానే జెనీలియా సినిమాలు వదిలేసి సంసారంలో సెటిల్ కావాల్సి వచ్చింది. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి నటనలోకి వచ్చింది. రితేష్ స్వయంగా దర్శకత్వం వహించిన ఓ మరాఠా హిట్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా ఆ తర్వాత సల్మాన్, జాన్ అబ్రహాం లాంటి స్టార్ల సినిమాల్లో అతిథి పాత్రల్లో మాత్రమే నటించింది. జెనీలియా మళ్లీ మూడేళ్ల గ్యాప్ తర్వాత `సితారే జమీన్ పర్` చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. అమీర్ ఖాన్ స్వయంగా ఈ సినిమాలో నటించడమే గాక, నిర్మాతగా పెట్టుబడులు పెట్టారు.
ఈ సమయంలో జెనీలియా తన నటనా కెరీర్ గ్యాప్ లతో సాగడం వెనక కారణాన్ని వెల్లడించింది. తాను పదేళ్ల పాటు నటనకు విరామం ఇవ్వాలనుకున్నట్టు అంగీకరించింది. తాను తన భర్త పరిశ్రమ వ్యక్తులం కాబట్టి ప్రతిదీ అర్థం చేసుకోగలం. బయటి నుంచి వచ్చిన నటీనటులు ఎవరైనా గ్యాప్ వస్తే కంగారు పడేందుకు ఛాన్సుంది. కానీ నేను అలా కంగారు పడను.. అర్థం చేసుకుని ముందుకు సాగాను అని జెనీలియా తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను కుటుంబం కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చానని, ఇప్పుడు రీఎంట్రీతో చాలా ఆనందంగా ఉన్నానని కూడా జెనీలియా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. జెనీలియా- రితేష్ సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.