మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్- రాజ్ కుమార్ హిరాణీ కాంబినేషన్ లో వచ్చిన సెటైరికల్ కామెడీ `పీకే` దశాబ్ధం క్రితం విడుదలై చాలా వివాదాలను మోసుకొచ్చినా ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో హిందూ దేవతలను కించపరిచారని బ్రాహ్మణ సంఘాలు నిరసనలు వ్యక్తం చేసాయి. చాలా సమస్యల్ని ఎదుర్కొన్నా కానీ, భారీ విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రచారం సాగింది.
కానీ ఇంతకాలం రాజ్ కుమార్ హిరాణీ సీక్వెల్ ని డిలే చేసారు. అతడికి ఉన్న ఇతర కమిట్మెంట్ల కారణంగా దీనిపై దృష్టి సారించలేదు. ఎట్టకేలకు అతడు పీకే సీక్వెల్ ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం అమీర్ ఖాన్ కథానాయకుడిగా దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ ని రూపొందిస్తున్న హిరాణీ, ఆ తర్వాత పీకే 2 పై దృష్టి సారిస్తారని తెలిసింది. పీకే క్లైమాక్స్ లో రణబీర్ ఎంట్రీతో సీక్వెల్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇప్పుడు సీక్వెల్లో అమీర్ తో పాటు రణబీర్ కూడా కీలక పాత్రధారిగా కనిపిస్తాడు. గ్రహాంతర వాసిగా రణబీర్ ని అభిమానులు తెరపై వీక్షించే వీలుందని తెలుస్తోంది.
అయితే అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ ఇప్పుడు మారిన ట్రెండ్ ని శ్రద్ధగా గమనించాలి. ఆ ఇద్దరూ ఎంత గొప్ప దిగ్గజాలు అయినా హిందూ దేవుళ్లను కించపరుస్తూ సినిమాలు తీస్తే, కచ్ఛితంగా దాని పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పీకే మూవీ వివాదానికి మూల కారణం వారికి తెలుసు కాబట్టి, ఇప్పుడు సీక్వెల్ లో ఆ తప్పు రిపీట్ కాకుండా జాగ్రత్త పడతారేమో చూడాలి. మనోభావాలు దెబ్బ తినే ఈరోజుల్లో వందల కోట్ల బడ్జెట్ తో సాహసాలు చేయడం సరికాదేమో!