అండర్ వరల్డ్ కనుసైగ చేయనిదే ఒకప్పుడు బాలీవుడ్ నడిచేది కాదు! ముంబై చిత్ర పరిశ్రమపై అండర్ వరల్డ్ ప్రభావం పీక్స్లో ఉన్నప్పుడు గ్యాంగ్స్టర్ల నుండి వచ్చిన కాల్స్ను తాను ఎలా ఎదుర్కొన్నాడో బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి వివరించాడు. 90వ దశకంలో శెట్టి ఇంటి పేరున్న వారిని ముంబైలో అండర్ వరల్డ్ మాఫియా డబ్బు కోసం బెదిరిస్తుండేదని తెలిపాడు. చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నందున తాము కూడా దూకుడుగా మారామని, ఐక్యంగా ఉండేవాళ్లమని ఆయన అన్నారు. అండర్ వరల్డ్కు వ్యతిరేకంగా నిలబడే ఒక సొంత గ్యాంగ్ను కూడా మెయింటెయిన్ చేసేవాళ్లమని శెట్టి చెప్పాడు. ఒకే ఇంటిపేరును చెబితే, డబ్బు కట్టాలని గ్యాంగ్స్టర్లు బెదిరించడానికి ప్రయత్నించేవారట.
తన ఇల్లు, ఆఫీస్, తన మేనేజర్ ఇంటికి కూడా బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. బహుశా భయపెడితే శెట్టిలు భయంతో హఫ్తా చెల్లించడం ప్రారంభిస్తారని మాఫియా భావించి ఉండవచ్చు. అలా ఒకరోజు హేమంత్ పూజారి నాకు ఫోన్ చేసి, మీ నాన్న ఉదయం 5- 5:30 గంటలకు వాకింగ్కి వెళ్లినప్పుడు నేను అతనిని కాల్చివేస్తానని చెప్పాడు. అయితే నేను తట్టుకోలేకపోయాను. నేను కూడా అతడిని దుర్భాషలాడాను. అతడిని మాట్లాడనివ్వలేదు... అని తెలిపాడు.
కాల్ చేసిన వ్యక్తికి సునీల్ కౌంటర్ గట్టిగా ఇచ్చాడు. నా గురించి నీకు తెలిసిన దానికంటే, నీ గురించి నాకు ఎక్కువ తెలుసని కాల్ చేసిన వ్యక్తికి చెప్పాడు. అంతేకాదు, రికార్డింగ్లను ముంబై పోలీసులకు అందించేవాడు. హేమంత్ పూజారి ముఠాలోని కొంతమంది తనను బెదిరించడం ద్వారా పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నారని ఇదంతా డబ్బు కోసమేనని సునీల్ శెట్టి తెలిపారు.
కెరీర్ పరంగా చూస్తే, సునీల్ శెట్టి చివరిసారిగా కేసరి వీర్ సినిమాలో కనిపించాడు. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, సూరజ్ పంచోలి కూడా కీలక పాత్రల్లో నటించారు.