సినిమావాడు ఏం రాజకీయాలు చేస్తాడు, సినిమాల్లో ఉన్న అభిమానం ఫ్యాన్స్ కి రాజకీయాల్లో ఉండదు, చూపించరు అంటూ పవన్ కళ్యాణ్ ని చాలామంది ఎద్దేవా చేసారు. నిజంగానే ఓ పదేళ్ల పాటు పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ రాజకీయనాయకుడిగా మిగిలిపోయారు, ఆయన అభిమానులే ఆయన్ని మోసం చేసారు. కానీ 2024ఎన్నికల్లో జనసేన పార్టీ తో పవన్ కళ్యాణ్ సత్తా చాటటమే కాదు, ఏపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ రాజకీయనాయకుడిగా మారిపోయారు. చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇంత రాటు తేలిపోయారా అనేలా ప్రవర్తిస్తున్నారు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నా తాజాగా జరిగిన ఓ పరిణామం మాత్రం పవన్ కూడా రాజకీయాలు నేర్చారు అంటూ నెటిజెన్ల్ మాట్లాడుకునేలా చేసింది.
రీసెంట్ గా థియేటర్స్ బంద్ విషయంలో డిప్యూటీ సీఎం హోదా లో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారు. దాని వెనుక ఎవరున్నా వారిని వదలము అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఇప్పుడు థియేటర్స్ బంద్ విషయం సర్దుమణగడంతో పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ప్రకటన చూసే అందరూ పవనూ రాజకీయం నేర్చారంటూ మాట్లాడుకుంటున్నారు.
టికెట్ ధరల పెంపు విషయమే కాదు సినిమా హాళ్ల నిర్వహణ విషయం ఇలా ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చెయ్యాలని, త్వరలో విడుదలయ్యే తను నటించిన హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని... ఇందులో తనమన బేధాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు.
అంతేకాదు థియేటర్స్ బంద్ విషయంలో తనవాడైనా క్షమించను అని పవన్ చెప్పినట్టుగానే జనసేన నాయకుడు, ఎగ్జిబిటర్ సత్యన్నారాయణ థియేటర్స్ బంద్ వెనుక ఉన్నారని తెలిసి అతన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యడం వంటి విషయాలు చూసి జనాలు పవనూ రాజకీయం నేర్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.