ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Acham Naidu controversial comments on yellow coin

ఏపీలో పసుపు బిళ్ల గట్టిగా నడుస్తోందే!

ఏపీలో పసుపు బిళ్ల నడుస్తోందిగా!

పసుపు బిళ్ల.. ఇప్పుడు ఎవరినోట విన్నా.. సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఇదే చర్చ.. దీనిపైనే రచ్చ! ఏ క్షణాన అచ్చెన్నాయుడు నోట పసుపు బిళ్ల మాట వచ్చిందో తెగ ట్రోల్ అవుతోంది..! దీన్ని కొందరు మంచిదే కదా అంటుంటే.. ఇంకొందరేమో ఓరి బాబోయ్ ఆపండ్రా అంటూ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. అందుకే ఇప్పుడు ఏపీ మొత్తం పసుపు బిళ్ల పంచాయితీ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బిళ్లతో ప్రభుత్వానికి తొలిరోజుల్లోనే కావాల్సినంత చెడ్డపేరు వచ్చేసింది..!. అసలే సోషల్ మీడియా కాలం.. ఆచి తూచి అడుగులు, మాట్లాడాల్సిన అచ్చెన్న అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఇలా చేయడంతో సొంత పార్టీ నేతలే ఒకింత నొచ్చుకుంటున్న, మండిపడుతున్న పరిస్థితి నెలకొందంటే అర్థం చేసుకోవచ్చు..!

యో.. ఏందిది అచ్చెన్నా..?

పోలీస్ స్టేషన్లు, ఎమ్మార్వో, ఎండీవో కార్యాలయాలకు వెళ్లే టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లతో వెళ్లండి.. అపుడు అధికారులో మీకు టీ ఇచ్చి, కుర్చీలు వేసిమరీ పనులు చేసిపెడతారు.. ఒకవేళ తాను చెప్పినట్లు అధికారులు వినకపోతే ఏం జరుగుతుందనేది మాటల్లో చెప్పనని చేతల్లో చేసి చూపిస్తానని అచ్చెన్నాయుడు నిండు సభలో అన్నారు. ఇక చూస్కోండి.. అప్పటికే ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని వేచి చూసిన వైసీపీ ఈ పసుపు బిళ్లను సువర్ణావకాశంగా మలుచుకుని ఒక రేంజిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇక కౌంటర్లు, మీమ్స్, కార్యకర్తలు నోటికొచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారు. పసుపు బిళ్ల టీడీపీ వాళ్లకేనా మాక్కూడా ఉంటుందా..? అని కొందరు మరికొందరేమో జనసేన, బీజేపీలు కూడా ఎరుపు, కాషాయ బిళ్లలు తీసుకెళ్లొద్దా..? వాళ్లేం పాపం చేశారని ప్రశ్నిస్తున్న పరిస్థితి.

ఇంత అవసరమా..?

పోనీ.. టీడీపీ కార్యకర్తలకు న్యాయం చేయాలి.. వారి పనులు చేయించాలనే తపన మనసులో ఉంటే ఇదంతా నలుగురిలో కాకుండా.. నాలుగు గోడల మధ్య చర్చించుకోవాల్సిన విషయం కదా..! ఇలా బహిరంగంగా మాట్లాడి అభాసుపాలవ్వడం దేనికి..? అసలు ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే.. ఉదయం లేచి గవర్నమెంట్ ఆఫీసుకెళ్లి టీ తాగి.. వీలైతే టిఫిన్ కూడా చేసి రావడానికి వెళ్తున్నా ఎవరైనా వస్తారా..? అంటూ ఒక్కొక్కరుగా వైసీపీ వాళ్లు రచ్చ రచ్చ చేసేస్తున్నారు. ఇంకొందరైతే టిఫిన్ సరే కానీ గట్టి చట్నీతో తినేసి రండి అని సలహాలు ఇవ్వడం.. బాబోయ్.. ఇలా ఒకటా రెండా అవన్నీ మాటల్లో చెప్పలేం అంతే..! మరికొందరు అయితే బూతులే తిట్టేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే అచ్చెన్న మాట్లాడిన ఈ మాటలను సొంత పార్టీ నేతలు, కేడర్ సైతం తప్పుబడుతున్న పరిస్థితి. ఇందుకేనా ప్రజలు అధికారం మీకిచ్చింది..? పార్టీలు, కులం, మతం.. ప్రాంతం ఇవేమీ లేకుండా పాలను చేయాల్సిన అవసరం లేదా..? ఆరంభంలోనే ఏమిటీ బిళ్లల గోల.. అంటూ తిట్టిపోస్తున్న పరిస్థితి. మరి ఈ గోల నుంచి తప్పించుకోవాలంటే అచ్చెన్న మళ్లీ ఏదో ఒకటి చేయాల్సిందే మరి.

Acham Naidu Hot Comments About Yellow Coin

Acham Naidu controversial comments on yellow coin
acham naidu