‘వీరసింహారెడ్డి’లో ‘సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని నేనొక్కడినే కత్తి పట్టా’ అనే డైలాగ్ వెనుక పెద్ద కథ వుంది. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, లెజెండ్, అఖండ ఎలాగో వీరసింహారెడ్డి కూడా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఆయన హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి స్పెషల్గా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా శుక్రవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఒంగోలులో భారీగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ..
‘‘ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడి స్వరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నా తండ్రి, నా గురువు, దైవం, ఆ కారణజన్ముడికి శత జయంతి అభినందనలు. అందరికీ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కుటుంబ సభ్యుడు దర్శకుడు బి గోపాల్గారికి కృతజ్ఞతలు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహనాయడు ఇలా చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు అందించారాయన. ఈ వేడుకకు బి గోపాల్ గారు ఒక పెద్దరికాన్ని తీసుకొచ్చారు. ఇన్ని కోట్ల మంది అభిమానులని పొందానంటే అది జన్మజన్మల అనుబంధం అనిపిస్తుంటుంది. నటీనటుల నుండి ప్రతి టెక్నిషియన్ నుండి టాలెంట్ని తీసుకునే సత్తా వున్న ఒంగోలు గిత్త మలినేని గోపిచంద్. సినిమా మాధ్యమం ద్వారా సమరవీరుడిని నేను. మానవరణ్యంలో కల్మషం కుతంత్రాలని వేటాడే సింహరాజుని సింహాన్ని నేనే. అలాగే ఒక హుందాతనంతో రోషానికి పౌరుషానికి ప్రతీకనైన రెడ్డిని నేనే .. నాయుడిని నేనే. ప్రేక్షకులు, అభిమానులు చూపిస్తున్న అనంతరమైన అభిమానానికి నేను అపూర్వంగా అనురాగంగా పరిచే మనసు మీ బాలకృష్ణది.
ఎన్నో రకాల సినిమాలు చేశాను.. ఇంకా కసి తీరలేదు. ‘అఖండ’కు మించిన విజయాన్ని అందుకోవాలి.. లేదా చేరుకోవాలనేది ఒక బరువు అనుకోలేదు. ఇప్పుడు వీరసింహారెడ్డిని తీశాం. ఇది ఒక ఎపిక్. ‘సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని నేనొక్కడినే కత్తి పట్టా’ అనే డైలాగ్ ఇందులో వుంది. దీని వెనుక పెద్ద కథ వుంది. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, లెజెండ్, అఖండ ఎలాగో ఈ వీరసింహారెడ్డి కూడా చరిత్రలో నిలిచిపోతుంది. శృతి హాసన్ కమల్ హాసన్ గారికి తగ్గ తనయ. అందంగా కన్నుల విందుగా అద్భుతంగా నటించింది. హనీ రోజ్ పాత్ర గురించి ఇప్పుడు చెప్పకూడదు. చాలా అద్భుతమైన పాత్ర. సినిమా చూశాక అందరూ ఆ పాత్ర గురించి మాట్లాడుకుంటారు. దునియా విజయ్ చాలా అద్భుతంగా చేశారు. ఆయనకి చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలాగే అజయ్ ఘోష్, సప్తగిరి అందరూ చక్కగా చేశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్, వెంకట్ మాస్టర్ చాలా అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు. తమన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. రిరికార్డింగ్ లో సౌండ్ బాక్సులు బద్దలౌతాయి. బుర్రా సాయిమాధవ్ పదునైన డైలాగ్స్ అందించారు. మా నిర్మాతలు రవి గారు, నవీన్ గారు అద్భుతమైన నిర్మాతలు. టర్కీలో కూడా షూట్ చేశాం. సినిమాకి కావాల్సిన సమస్తం సమకూర్చారు. వీరసింహా రెడ్డి ఒక విస్ఫోటనం. బాగా ఆడుతుందని చెప్పను.. బాగా ఆడి తీరుతుంది. ప్రేక్షకులు, అభిమానులందరికీ కృతజ్ఞతలు’’ అని చెప్పుకొచ్చారు.