ఇకపై 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ

నిన్నటివరకు ఏపీ థియేటర్స్ లో 50 శాతం అక్యుపెన్సీతో ఆడియన్స్ కి అనుమతి ఉంది. కరోనా థర్డ్ వేవ్ ఆంక్షలతో జనవరి రెండో వారం నుండి నైట్ కర్ఫ్యూలు, థియేటర్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేసింది ఏపీ ప్రభుత్వం. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మొన్న 14 నుండి నైట్ కర్ఫ్యూ ఎత్తేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతి మంజూరు చేసింది. అది కూడా ఇవాళ్టి నుంచే వందశాతం ఆక్యుపెన్సీ అమలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో వెల్లడించింది. కరోనా నిబంధనల మేరకు థియేటర్లలో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది.
దానితో రేపు విడుదల కాబోతున్న చిత్రాలకు లైన్ క్లియర్ అయ్యింది. మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా, లగడపాటి శ్రీధర్ కొడుకు వర్జిన్ లవ్ స్టోరీలు రేపు విడుదల కాబోతున్నాయి. అలాగే ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న భీమ్లా నాయక్ కి ఊరట లభించింది. ఆడవాళ్లు మీకు జోహార్లు, గని మూవీస్ కూడా ఈనెల 25 నే థియేటర్స్ లో విడుదలవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఇవ్వడం పట్ల సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఏపీలో సినిమా టికెట్ల ధరలపై త్వరలోనే నిర్ణయం వస్తుందని.. ఈ రోజు జరిగిన కమిటీ సమావేశం తర్వాత ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు అన్నారు. ప్రజలు, సినిమా పరిశ్రమ సంతృప్తి చెందేలా టికెట్ రేట్స్ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. మూడు స్లాబుల్లో టికెట్ల ధరలు ఉంటాయని.. ప్రేక్షకులు ఇబ్బందిపడే సమస్యలన్నీ తొలగిపోతాయని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.
Andhra Pradesh: 100% occupancy for movie halls allowed
AP Govt allows 100 percent occupancy in Theatres






































