ప్రకాష్ రాజ్ ఇప్పట్లో వదిలేలా లేరుగా

మా ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రకాష్ రాజ్ ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచాక మొఖానికి నవ్వు పులుముకుని తిరిగిన ప్రకాష్ రాజ్ ఉన్నట్టుండి మా సభ్యత్వానికి రాజీనామా చేసారు. అంతేకాకుండా తన ప్యానల్ లో గెలిచిన, గెలవని సభ్యులతో ప్రెస్ మీట్ పెట్టి.. మోహన్ బాబు, నరేష్ లు ఎన్నికల సమయంలో చేసిన పనులని ఎండగట్టారు. మా కి ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి గెలిచిన ప్రతి ఒక్కరూ రాజీనామా చేసారు. మంచు విష్ణు మాత్రం ఈసీ మీటింగ్ పెట్టాకే వాళ్ళ రాజీనామాలు ఆమోదిస్తానంటున్నారు. ఇక మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈ నెల 16 న ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు.
ఈలోపు ప్రకాష్ రాజ్ మరో బాంబు పేల్చారు. అది మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ.. మా ఎన్నికల అధికారికి ఘాటైన లేఖని సంధించారు. ఎన్నికల అధికారి కృష్ణ మనోహర్ గారికి .. ఈమధ్యనే జరిగిన మా ఎన్నికల్లో ఎన్నో అనుకోని, దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. నరేష్, మోహన్ బాబు లు మా సభ్యులని బెదిరించడమే కాదు.. అనరాని మాటలను అంటూ బాధ పెట్టారు. అంతేకాకుండా భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు. మా ఎన్నికలు జరుగుతున్న సమయంలో వారు వారి ఆధిపత్యాన్ని చూపించేందుకు మీరు మీ విచక్షణాధికారాలను ఉపయోగించారని నేను అనుకుంటున్నా. కొన్ని విజువల్స్ మీడియాకు లీక్ అయ్యాయి. ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన సంఘటనలు జనాలు నవ్వుకునేలా చేస్తున్నాయి.
పోలింగ్ జరుగుతున్నప్పుడు సీసీ టివి ఫుటేజ్ గురించి మాట్లాడారు.. ఆ సీసీ కెమెరాలు అక్కడ జరిగిన ప్రతి ఒక్క ఘటనను రికార్డ్ చేసే ఉంటాయి.. ఆ ఫుటేజ్ మాకు ఇప్పించగలరు. ఎన్నికలకు సంబంధించి అవసరమైన పూర్తి సమాచారాన్ని పొందే ప్రజాస్వామ్య హక్కు మాకు ఉంది అంటూ ప్రకాష్ రాజ్ మా ఎన్నికల అధికారికి లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది.
Prakash Raj seeks CCTV footage of MAA polls, alleges lapses
Prakash Raj writes letter to MAA election officer







































