గత కొన్ని రోజులుగా హీరో గోపీచంద్ కెరీర్లో సరైన హిట్ ఒక్కటి కూడా లేదు. లౌక్యం తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద పరాజయాన్ని చూసాయి. గత ఏడాది దసరా కానుకగా వచ్చిన చాణక్య సినిమా కూడా గోపీచంద్ కి హిట్ ఇవ్వలేకపోయింది. అయితే ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అనే సినిమా చేస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు.
అయితే ఈ సినిమా అనంతరం గోపీచంద్, డైరెక్టర్ తేజ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని టాక్. తేజ రెడీ చేసిన అలివేలు మంగ వెంకటరమణ కథ పట్టాల మీదకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ మారుతి గోపీచంద్ కి కథ చెప్పాడని వినిపిస్తుంది.
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ప్రతీరోజూ పండగే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మారుతి తర్వాతి సినిమా ఏ హీరోతో ఉంటుందని ఇప్పటికీ డిసైడ్ అవలేదు. అల్లు అర్జున్ కథ రాస్తున్నాడని వార్తలు వస్తున్నా అందులో నిజం లేదని తెలుస్తుంది. అయితే గోపీచంద్ కి కథ వినిపించాడని, ఈ విషయమై గోపీచంద్ పాజిటివ్ గానే ఉన్నాడని టాక్. చూడాలి మరేం జరగనుందో..!