సీఎం జగన్-చిరు భేటీకి ముహూర్తం ఫిక్స్!?
Date Fix For CM YS Jagan and Chiru Meeting!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో త్వరలోనే భేటీ కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చిన విషయం విదితమే. అయితే ఈ ఇద్దరి భేటీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలియవచ్చింది. జూన్-01న సాయంత్రం భేటీ ఉంటుందని ఈ మేరకు సీఎంవో ఆఫీస్ నుంచి మెగాస్టార్కు కబురు అందినట్లు సమాచారం. వాస్తవానికి అంతకు ముందే భేటీ జరగాల్సి ఉన్నప్పటికీ వైఎస్ జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మేధోమథన సదస్సులో భాగంగా ‘మన పాలన- మీ సూచన’లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల చివరి వరకూ ఈ కార్యక్రమాలున్నాయ్. అందుకే జూన్-01న భేటీకి ముహూర్తం కుదిరిందట.
ఈ సందర్భంగా జగన్తో మెగాస్టార్ పలు విషయాలను పంచుకోవడంతో పాటు.. పలు విజ్ఞప్తులు చేయబోతున్నారు. మరీ ముఖ్యంగా.. ఏపీలో సినిమా రంగం అభివృద్ధి, స్టూడియోస్ నిర్మించుకోవడానికి గాను అనుమతులు.. ఏమేం మినహాయింపులు ఉంటాయనే విషయాలపై నిశితంగా చర్చించనున్నారని తెలియవచ్చింది. మరోవైపు ఏపీలో సినిమా థియేటర్ల ఓపెనింగ్స్పై కూడా చర్చించబోతున్నారట. ఈ మేరకు చిరంజీవి, టాలీవుడ్ పెద్దలు ఓ నివేదికను తయారు చేసుకున్నారట. మరి భేటీలో ఏమేం చర్చకు రానున్నాయో తెలియాలంటే జూన్-01 వరకు వేచి చూడక తప్పదు.
Date Fix For CM YS Jagan and Chiru Meeting!







































