ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Manam Saitham Arranges Free Medical Camp

మనంసైతం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Manam Saitham Arranges Free Medical Camp

ప్రముఖ నటులు, సంఘ సేవకులు కాదంబరి కిరణ్ కొనసాగిస్తున్న మనం సైతం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో మెడీకవర్ ఆస్పత్రి సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ అతిథిగా పాల్గొన్నారు. చిత్రపురి కాలనీలో పనిచేస్తున్న కార్మికులు ఈ వైద్య శిబిరంలో వైద్య సేవలు అందుకున్నారు. ఇదే కార్యక్రమంలో గ్రీన్  ఛాలెంజ్ బృహత్ కార్యంతో తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనం కోసం పాటుపడుతున్న తెరాస రాజ్యసభ సభ్యులు జె సంతోష్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా హరిత హారం జరిపి, మొక్కలు నాటారు. కేక్ కట్ చేసి కార్మికులకు పంచారు. మనం సైతం సంస్థ తరుపున చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న దివ్యాంగుడైన మేనేజర్ ప్రవీణ్ కుమార్ కు 25 వేల రూపాయలు, సీనియర్ నటుడు మల్లేశంకు 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్మికులకు దోమ తెరలు, దుప్పట్లు ఉచితంగా అందించారు.

ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ... ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతున్నాం. ఇలాంటి నగరం పచ్చగా ఉండాలంటే హరిత హారం నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. కాదంబరి కిరణ్ గారు ఈ కార్యక్రమానికి ముందడగు వేయడం సంతోషంగా ఉంది. ఆయన మనం సైతం సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తున్నా. చిత్రపురి కాలనీలో ఏ సమస్య వచ్చినా తీర్చేందుకు నా వంతు సహకారం అందిస్తా. అన్నారు.

కాదంబరి కిరణ్ మాట్లాడుతూ... భావి తరాలకు మనమిచ్చే నిజమైన సంపద చెట్లే. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుతో సంతోష్ కుమార్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మా వంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ చిత్రపురి కాలనీలో కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, దోమతెరలు, దుప్పట్లు అందజేశాం. ఇద్దరు నిస్సహాయులకు ఆర్థిక సహాయం అందించాం. మనం సైతం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుంది. అన్నారు.

ఈ కార్యక్రమంలో దినేష్, పీవీ శ్రీనివాస్, ఎన్ శంకర్, దీప్తి వాజ్ పాయ్, మనం సైతం, చిత్రపురి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Kadambari Kiran Manam Saitham Free Medical Camp details

kadambari kiran
manam saitham
free medical camp
details