అక్కినేని కుటుంబంతో దగ్గుబాటి కుటుంబం బంధుత్వం అందరికీ తెలిసిందే. వెంకటేష్ కూడా తన కెరీర్ ప్రారంభంలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి 'బ్రహ్మరుద్రులు' అనే చిత్రం చేశాడు. ఇక విషయానికి వస్తే అక్కినేని మనవడు, ఆయన కుమార్తె తనయుడు, తన కుమారులంటే కంటే ఎంతో ఇష్టంగా, తల్లిలేని బిడ్డగా పెంచుకున్న మనవడు యార్లగడ్డ సుమంత్. ప్రస్తుతం సుమంత్ బాలకృష్ణ-క్రిష్ల కాంబినేషన్లో రూపొందుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్లో తన తాత ఏయన్నార్ పాత్రను పోషిస్తున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు 94వ జయంతి సందర్భంగా ఈ చిత్రంలోని ఏయన్నార్ గెటప్లోని సుమంత్ స్టిల్ని విడుదల చేశారు.
దానిపై వెంకటేష్ స్పందిస్తూ అలనాటి మేటినటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ని చూసి తాను చూస్తున్నది సుమంత్నా? ఏయన్నార్నా? అనేది అర్దం కాలేదని తెలిపాడు. క్షణం పాటు నేను చూస్తున్నది సుమంత్నా? ఏయన్నార్నా అనేది అర్ధం కాలేదు. ఏయన్నార్ గొప్పవ్యక్తి. ఆయనో లెజెండ్. మా హృదయాలలో ఆయనెప్పుడు నిలిచిపోతారు.. అని వెంకీ స్పందించాడు. ఈ కామెంట్ని బట్టి సుమంత్ ఎంతలా ఏయన్నార్ గెటప్లో ఇమిడిపోయాడో అర్ధం అవుతుంది. ఇక తనకి నచ్చితే ఎవరినైనా, దేనినైనా భేషజాలు లేకుండా మెచ్చుకోవడంలో వెంకీ ముందుంటాడు. ఏయన్నార్ గెటప్లో కనిపిస్తున్న సుమంత్ని గురించి నాగార్జున, నాగచైతన్య, సమంత వంటి అక్కినేని కుటుంబసభ్యుల కంటే ముందుగా వెంకీ స్పందించడం చూస్తే సుమంత్ గెటప్ ఆయనని ఎంతలా ఆకట్టుకుందో అర్ధమవుతోంది.
వెంకీ వెలిబుచ్చిన అభిప్రాయాన్నే ప్రతి ఒక్కరు వ్యక్తపరుస్తున్నారు. ఇలా ఈ విషయంలో 'ఎన్టీఆర్' యూనిట్ ఘన విజయం సాధించిందనే చెప్పాలి. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలకు సిద్దమవుతోన్న ఈ చిత్రం విడుదలైన తర్వాత ఎన్ని సంచలనాలకు వేదికగా మారుతుందో వేచిచూడాల్సివుంది...!