తెలుగు పరిశ్రమకి పెట్టని కోట కోటశ్రీనివాసరావు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఏ విషయంపైనైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతారు. ఈయన విజయవాడ నుంచి బిజెపి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నాడు స్వర్గీయ ఎన్టీఆర్పై కౌంటర్గా తీసిన 'మండలాధీశుడు'తో పాటు పలు చిత్రాలలో నటించాడు. నాడు ఎన్టీఆర్ అభిమానులు ఆయనను చంపడానికి కూడా సిద్దమయ్యారని నాటి పరిస్థితులను ఆయన ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేను కేవలం కళాకారుడిని, నాకు వచ్చిన పాత్రకు నేను న్యాయం చేయాలి. ఇక మిగిలిన విషయాలు ఓ కళాకారుడిగా నాకు అనవసరం. మరి తోటి కళాకారుడైన ఎన్టీఆర్కి ఆ విషయం తెలియపోతే ఎలా? అని ప్రశ్నించాడు.
తాజాగా ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ కారణజన్ముడు. కాబట్టి ఆయనకే అంతటి గొప్పపేరు వచ్చింది. అందువల్ల ఆయనేమైనా చిన్నతప్పు చేసినా ఎవ్వరూ పట్టించుకోకుండా ఆయనను ఆరాధించారు. కాబట్టి ఆయన ఒక్కడికే అంత పేరు వచ్చి చరిత్రలో నిలిచిపోయాడు. అంతటి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆ కుటుంబంలో ఎవరున్నారు? ఏదో కాస్త అందం గిందం బాలకృష్ణకి వచ్చాయి. ఆయన భాష అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ నటనతో పోల్చుకుంటే బాలయ్య ఎంత? ఎప్పుడు సెట్లో కూర్చుని ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్పుకుంటూ ఉంటాడు బాలయ్య. ఇక 'బాహుబలి' గొప్ప చిత్రమే. కానీ దాని గురించి నేడు కూడా ఎందుకు మాట్లాడరు? నాడు తీసిన 'మాయాబజార్'నే అందరూ ఇప్పటికీ ఎందుకు చెప్పుకుంటారు. 'బాహుబలి' చిత్రానికి ఎందరో సాంకేతిక నిపుణులు పనిచేసినా రాజమౌళికే పేరు వచ్చింది అంటే దర్శకుడే ఎవర్గ్రీన్ అని కదా...! మరి నేటి వారే ఇంతగా చెప్పుకుంటే నిన్నటితరం దర్శకులను ఏమిని పొగడాలి?
నాడు దర్శకనిర్మాతలు సినిమాలతో వ్యాపారం చేసినా ఎంతో బాధ్యతగా చేసేవారు. నేడు అది లేదు. ఇక ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. కేసీఆర్కి తెలంగాణ విషయంలో ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అరటిపండుని ఒలిచి కొత్త రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెట్టారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్లో, తెలంగాణలో అన్ని ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ అదృష్టవంతుడు. కానీ ఏపీ పరిస్థితి అది కాదు. ఆకులు ఏరి విస్తరాకు కుట్టాలి. నాకు తెలసి హైదరాబాద్లో ఉన్న రోడ్డు అభివృద్ది అమరావతి, విజయవాడల్లో జరగాలంటే మరో 20 ఏళ్ల పడుతుంది. ముందస్తు ఆలోచన చేసే నాయకుడు, రాజకీయ వేత్త అయిన చంద్రబాబు ఉంటేనే భవిష్యత్తులో ఏపీ అభివృద్ది చెందుతుంది. ఆయన మినహా మనకి మరో ఆప్షన్ లేదంటూ కుండ బద్దలు కొట్టాడు.